ప్రకాశం జిల్లాలో పట్టణ మౌలిక వసతుల కల్పన సంస్థ (టిడ్కో) నిర్మాణం చేపట్టిన బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేయాలని లబ్దిదారులు ఏళ్లుగా కళలు కంటున్నారు. గత ప్రభుత్వం 2018 డిసెంబరులోపు నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లు అందజేయాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ప్రభుత్వం మారడంతో నిర్మాణాలే నిలిచిపోయాయి. రివర్స్ టెండరింగ్ లో ఇటీవలే ప్రభుత్వం కొత్త గుత్తేదారుకు నిర్మాణ పనులు ఆప్పగించింది. జిల్లాలో ప్రస్తుతం 9,690 ఫ్లాట్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి నూతన గుత్తేదార్లకు ఆమోదం లభించగా జిల్లా కేంద్రం ఒంగోలు శివారులోని కొప్పొలు వద్ద మాత్రమే వారం క్రితం పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల ఇంకా పనులు మొదలు కాలేదు.
ఇల్లు వస్తుందన్న ఆశతో రెండు సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్న వారు అధికారుల చుట్టూ తిరిగి అలసి పోయారు. వస్తుందో రాదో అన్న అయోమయంలో పడ్డారు. ఇప్పటికే డబ్బులు చెల్లించినవారిలో కొందరికి బ్యాంకులు నుంచి డిమాండ్ నోటీసులు అందుతున్నాయి. అటు బ్యాంకు కిస్తీలు కట్టలేక ... అద్దెల భారం మోయలేక అవస్థలు పడుతున్నారు. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొందరికి ఇళ్ల కేటాయింపులు రద్దుచేసిన ప్రభుత్వం వారికి ఇళ్లపట్టాలు అందజేస్తామని, అలానే జీప్లస్ 3 ఇంటికోసం కట్టిన డబ్బులు వెనక్కి తిరిగిస్తామని చెబుతుండటం పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశగా ఎదురు చూసిన ఇళ్లు అందలేదు. కట్టిన డబ్బులు తిరిగి రాలేదు. కొత్తగా ఇళ్ల పట్టాలు ఎప్పుడిస్తారో తెలియదు, అన్ని విధాలుగా నష్టపోయామని బాధితులు వాపోతున్నారు.