Accident: గేదె కళేబరాన్ని ఢీ కొని ప్రమాదం... ఐదుగురు మృతి - road accident at prakasham district
05:33 August 30
Accident: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఒంగోలు- కర్నూలు రహదారిలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఎక్కిన ఆటోను బోల్తా పడకుండా డ్రైవర్ నియంత్రిస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ దాన్ని ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరగడానికి ముందు రోడ్డు దాటుతున్న గేదెను మరో టిప్పర్ ఢీకొట్టింది. దీంతో గేదె మృతిచెందింది. ఈ క్రమంలో ఆ తర్వాత వచ్చిన ఆటో గేదె కళేబరాన్ని గమనించకుండా దానిపైకి ఎక్కింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారు దర్శి గ్రామానికి చెందిన పొట్లపాటి సారమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, కోటమ్మ, ఆటో డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. బేస్తవారిపేట మండలం కొత్తపల్లిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి:ఈమె కన్న తల్లేనా? పసి బిడ్డపై మరీ ఇంత పైశాచికత్వమా?