ప్రకాశం జిల్లా(Prakasam district)లో సాగర్ కాలువ పరిధిలో వరి పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతంలో వర్షాలు లేకున్నా సాగు చేసే రైతులు.. ఈ ఏడాది పుష్కలంగా నీళ్లున్నా సాగుకు దూరంగా ఉన్నారు(farmers stay away from the crop). మూడేళ్లుగా రైతులకు వరిసాగులో నష్టాలు రావడంతో... వ్యవసాయ భూములన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పెట్టుబడి ఖర్చులు పెరగడం.. ఆదాయం తగ్గడంతో సాగు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం కౌలు రైతులు కూడా పొలాలు కౌలు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదని.. రైతులు చెబుతున్నారు.
no crop: పుష్కలంగా నీళ్లు... పంటకు దూరంగా రైతులు - ప్రకాశం జిల్లాలో వరిసాగు
కనుచూపుమేరలో సాగుకు అవసరమైన పుష్కలమైన జలవనరు. పంట పండించేందుకు అనువైన వాతావరణం.. కష్టపడి పనిచేసే రైతులు, కూలీలకు కొదవే లేదు..అయినా వందల ఎకరాలు బీడుగా మారింది. కారణం మాగాణిలో వరిసాగు పెనుభారంగా మారడమే.. విఫరీతంగా పెరిగిపోతున్న పెట్టుబడులకు తోడు...దిగుబడులు తగ్గటం, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఈ ఏడాది పంటకు విరామమిచ్చారు.
అద్దంకి బ్రాంచ్ కాలువ పరిధిలో దర్శి, అద్దంకి, తాళ్ళూరు, ముండ్లమూరు తదితర మండలాల్లో వేలాది ఎకరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాగర్ కాలువ పరిధిలో దాదాపు లక్షన్నర ఎకరాలు మాగాణీ ఉండగా, కేవలం 25వేల ఎకరాలకు మించి నాట్లు వేయలేదు. ఈ ప్రాంతంలో నారుమడి దగ్గర నుంచి నాట్లు వేయడానికి, దమ్ము, ఎరువులు, కలుపు నివారణ, కోత వంటి వాటికోసం దాదాపు ఎకరానికి రూ.30వేల ఖర్చవుతున్నాయి. డీజిల్ , ఎరువుల ధరలతో పాటు కూలీ ధరలు పెరగడం వల్ల గతంతో పోలిస్తే... ఈ సారి మరింత ఖర్చు పెరిగింది. ఈ ప్రాంతంలో ఎకరాకు సరాసరి 25 నుంచి 28 బస్తాల దిగుబడి వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే ఎకరాకు కేవలం రూ.30,800 ఆధాయం మాత్రమే వస్తుంది. కనీసం కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు పంటకు విరామమిచ్చారు. రైతులు ఈవిధంగా పంట విరామం ప్రకటించుకుంటూ పోతే....తిండి గింజలు కూడా దొరకని పరిస్థితులు తలెత్తుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి