కరోనా బాధితులను ఆదుకునేందుకు అధికారులు సమర్థమైన ప్రణాళికలతో పనిచేస్తున్నారని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు తెలిపారు. ప్రణాళికాబద్దంగా మందులు, ఆక్సిజన్, పడకలు అందుబాటులోకి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని కొవిడ్ సహాయక చర్యలపై కలెక్టర్తో చర్చించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. జిల్లా కేంద్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 20 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ మాత్రమే ఉందని చెప్పారు.
ఇతర ప్రాంతాల్లో మరెక్కడా నిల్వ చేసుకోవడానికి వీలు లేకుండా ఉందని అన్నారు. అందువల్ల తమ కుమారుని ద్వారా ఓ ఆక్సిజన్ ట్యాంకర్ను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీని వల్ల జిల్లాలోని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాకు వీలవుందని తెలిపారు. ఒంగోలు రిమ్స్లో కూడా అదనపు మంచాలు ఏర్పాట్లు చేశారని.. ఓపీ కోసం వచ్చిన వారు ఉండేందుకు అనువుగా ఓ ప్రత్యేక షెడ్డును నిర్మించారని ఎంపీ వెల్లడించారు.