ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పక్కనే రామతీర్థం.. అయినా తాగేందుకు నీరు లేక అల్లాడుతున్న జనం - ఏపీ ప్రధాన వార్తలు

Water Problems : ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలంలోని గ్రామాలకు ఎగువను జల వనరుల సవృద్ధిగా ఉన్న నీటి సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు. త్రాగునీరు అందకపోవటంతో నీటిని కొనుగోలు చేసుకుని వినియోగించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు ఈ పరిస్థితి వచ్చిందని చీమకుర్తి మండల ప్రజలు అంటున్నారు.

KV Palem Water Problems
కేవీ పాలెం
author img

By

Published : Mar 1, 2023, 8:41 PM IST

పదిహేను రోజులుగా నీటి సరఫరా లేక ప్రకాశం జిల్లా కేవీ పాలెం ప్రజల ఇబ్బందులు

KV Palem People Facing Water Problems : సాగర్‌ జలాలతో గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పథకాలను అయితే ప్రారంభించారు కానీ.. నిర్వహణకు సరిపడా విద్యుత్‌ సరఫరా విషయంలో మాత్రం చర్యలు తీసుకోలేదంటున్నారు స్థానికులు. విద్యుత్​ సరఫరా సరిగా లేక అనేక గ్రామాల ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. ఎగువున నీటి వనరులు సమృద్ధిగా ఉన్నా.. దిగువ గ్రామాలకు మాత్రం తాగునీరు అందించలేని దుస్థితి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలంలో నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని.. పట్టించుకునే వారు లేరంటున్నారు బాధిత గ్రామాల ప్రజలు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని గ్రామాలకు రామతీర్థం జలాశయం ద్వారా తాగునీటి సరఫరా పథకాలను అమలు చేస్తున్నారు. తాళ్లూరు, కందుకూరు, కేవీ పాలెం, కనిగిరి ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించేందుకు.. పుష్కర కాలం కిందట పంపింగ్‌ స్కీమ్‌లను ప్రారంభించారు. ఈ క్రమంలో తాళ్లూరు, కేవీ పాలెం, కనిగిరి ప్రాంతాలన్నిటికీ కలిపి ఈ స్కీమ్‌ కింద కేవలం రెండు విద్యుత్తు ట్రాన్స్‌ ఫార్మర్లను మాత్రమే ఏర్పాటు చేశారు. అధికారికంగా కేవీ పాలెం స్కీమ్‌కు ట్రాన్స్‌ ఫార్మర్‌ను కేటాయించలేదు. ఇప్పటివరకు ఉన్న రెండు ట్రాన్స్‌ఫార్మర్లతోనే.. అన్నింటిని నడిపించారు. ప్రస్తుతం తాళ్లూరు, కనిగిరి ట్రాన్స్​ఫార్మర్లకు విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. మోటార్లు సామర్థ్యం చాలకపోవడంతో కేవీ పాలెం మోటర్లకు ఉన్న కనెక్షన్లను తొలగించారు. దీంతో కేవీ పాలెం స్కీమ్‌కు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా దిగువ గ్రామాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి.

రామతీర్ధం జలశయంలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో దిగువ గ్రామాలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. కేవీ పాలెం స్కీమ్‌లో భాగంగా ఓబచెత్తపాలెం, దేవరపాలెం, నిప్పెట్ల పాడు, మర్రిచెట్ల పాలెం.. ఇలా సుమారు 30 గ్రామాలకు 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. నీళ్లు లేక ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక వందల రూపాయిలు ఖర్చు చేసి నీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.

"గత ఇరవై రోజులుగా నీటి సమస్య ఉంది. సచివాలయంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదు. ఎందుకని ప్రశ్నిస్తే బకాయిలు ఉన్నాయని.. ట్రాన్స్​ఫార్మర్​ సమస్య ఉందని అంటున్నారు. మాకు రెక్కాడితేగానీ డొక్కాడదు అలాంటి పరిస్థితులలో.. కూలికి వెళ్లి వచ్చి మళ్లీ నీటి కోసం ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తోంది. కనీసం అందుబాటులో చేతి పంపులు లేవు." -మహేంద్ర, స్థానికుడు

"ఇరవై రోజుల నుంచి కుళాయి నీళ్లు రావటం లేదు. సమస్య గురించి అడిగితే ట్రాన్స్​ఫార్మర్​, బకాయిలు అంటున్నారు. ప్రభుత్వం ఇవన్ని పట్టించుకోవాలి కదా. ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదు. తాగునీటికి ఇబ్బందిగా ఉంది." - పిచ్చి రెడ్డి, స్థానికుడు

ఎన్నిసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా, స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి కేవీ పాలెం స్కీమ్‌కి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ని ఏర్పాటు చేసి తమ ప్రాంత ప్రజలను నీటి కష్టాల నుంచి దూరం చెయ్యాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details