ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రకాశం జిల్లాలో కరోనా ప్రకంపనలు

By

Published : Apr 1, 2020, 5:04 AM IST

Updated : Apr 1, 2020, 8:13 AM IST

కరోనా కేసుల అలజడితో ప్రకాశం జిల్లా వణుకుతోంది. రాష్ట్రంలోనే ఎక్కువ పాజిటివ్‌ కేసులు ఈ జిల్లాలోనే నమోదు కావటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకటి మినహా పాజిటివ్ కేసులన్నింటికీ దిల్లీలో నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలకు లింకు ఉండటంతో అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ల కోసం అధికారులు జల్లెడపడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి.

In the state, more corona positive cases have been reported in Prakasam district
In the state, more corona positive cases have been reported in Prakasam district

ప్రకాశం జిల్లాలో కరోనా ప్రకంపనలు

ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌ కేసులు 11 నమోదు కావడం జిల్లా ప్రజలను కలవరపెడుతోంది. లండన్‌ నుంచి వచ్చిన యువకుడికి కరోనా సోకటంతో జిల్లాలో తొలి కేసు నమోదు కాగా... మిగిలిన 10 కేసులూ దిల్లీ మత సమ్మేళానికి ముడిపడి ఉన్నాయి. చీరాలకి చెందిన మత పెద్ద వీరందరినీ దిల్లీ తీసుకువెళ్లారు. మతపెద్దతో పాటు అతడి భార్యకూ కరోనా పాజిటివ్‌ రావటంతో అంతా ఉలిక్కి పడ్డారు. మత పెద్దని కలిసిన వారందరినీ అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులను ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించారు. ఒంగోలులో ఉంటున్న మత పెద్ద కుమారుడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావటంతో మూడో తరం కేసు ఇక్కడ ప్రారంభమైంది.

యంత్రాంగం అప్రమత్తం

దిల్లీలో మత ప్రార్థనకు వెళ్లిన కందుకూరుకు చెందిన ముగ్గురుకి కరోనా పాజిటివ్‌ రావడం స్థానిక ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. 300 మీటర్ల దూరాన్ని రెడ్​జోన్‌గా గుర్తించిన అధికారులు....రాకపోకలను పూర్తిగా ఆపేశారు. 3 కిలోమీటర్ల వరకూ పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. చీరాలలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన ఒకరు, కనిగిరికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మొత్తంమీద మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 8 కేసులు నమోదవటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక అధికారి ఉదయలక్ష్మి ఒంగోలులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో నిత్యవసరాలు, రేషన్‌ ఇంటికి పంపించే కార్యక్రమం చేపడుతున్నారు.

ప్రైవేట్​ ఆసుపత్రుల్లో చికిత్స

రిమ్స్‌ ఆసుపత్రిలో ఉన్న ఐసోలేసేషన్‌ వార్డును కేవలం రోగ లక్షణాలతో ఉన్న వారికే పరిమితం చేసి...కరోనా బాధితులను మాత్రం ఒంగోలులోని 2 ప్రయివేట్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒంగోలులో సంఘమిత్ర, కిమ్స్ ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని కోవిడ్‌ 19 ఆసుపత్రులుగా మార్చారు. అవసరాన్ని బట్టి మరో 2 ప్రైవేటు ఆసుపత్రులను ఆధీనంలోకి తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఏపీలో ఒక్కరోజే 21 కరోనా కేసులు నమోదు

Last Updated : Apr 1, 2020, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details