మనసుంటే మార్గముంటుంది అనడానికి ఆ యువకుడే ఉదాహరణ. కాలు లేకపోతేనేం ఆత్మవిశ్వాసంతో.. వచ్చిన పని చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఈపేటకు చెందిన కుమారస్వామి కుటుంబం 17ఏళ్ల కింద ప్రకాశం జిల్లా జాండ్రపేటకు వలసవచ్చారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి కుటుంబ భారం మోస్తున్నాడు. నేత పని నేర్చుకొని మగ్గం పెట్టుకుని ఆర్థిక కష్టాలు అధిగమించాడు. విధి వక్రీకరించి 4 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో కుమారస్వామి కాలు పోగొట్టుకున్నాడు. అప్పుడు మరోసారి జీవనోపాధి ఎలా అనే ప్రశ్న మొదలైంది.
ఈ ప్రమాదంతో పరిస్థితి మొదటికొచ్చింది. కుమారస్వామి మాత్రం ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఒంటికాలితోనే ధైర్యంగా ముందడుగేశాడు. తెలిసిన పనే చేయాలని నిర్ణయించుకున్నాడు. మగ్గానికి మార్పులు చేసి అనుకూలంగా మార్చుకున్నాడు. దానిపైనే చీరలు నేస్తూ.. వాటిని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. తల్లినీ పోషించుకుంటున్నాడు. వికలాంగుల కోటాలో పింఛన్కు అర్జీ పెట్టుకున్నా ప్రభుత్వం మంజూరు చేయలేదనీ.. తనను ఆదుకుంటే మరికొంతమందికి ఉపాధి కల్పిస్తాననీ అంటున్నాడీ కుమారస్వామి.