ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దర్శి వైకాపాలో వర్గ విభేదాలు..జగన్ జన్మదినం నేపథ్యంలో ఉత్కంఠ

ప్రకాశం జిల్లా దర్శి వైకాపాలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గాల బలాబలాలు నిరూపించుకోవటానికి సోమవారం జరగబోయే సీఎం జగన్​ పుట్టినరోజు వేడుకలు వేదికగా మారనున్నాయి. జగన్​ పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని ఇరువర్గాలు గట్టిగా సన్నాహాలు చేస్తున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తుండగా...బూచేపల్లి శివప్రసాద రెడ్డి పొదిలి రోడ్డులో గల పీజీఎన్ కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

By

Published : Dec 20, 2020, 9:42 PM IST

దర్శి వైకాపాలో వర్గ విభేదాలు
దర్శి వైకాపాలో వర్గ విభేదాలు

ప్రకాశం జిల్లా దర్శి వైకాపాలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గాలు నువ్వానేనా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. 2019 ఎన్నికలలో బూచేపల్లి శివప్రసాదరెడ్డి కొన్ని కారణాల వల్ల పోటీ చేసేందుకు విముఖత చూపించారు. దీంతో వైకాపా అధినేత జగన్...బూచేపల్లి మద్దత్తుతో మద్దిశెట్టి వేణుగోపాల్​ను ఎన్నికల బరిలో నిలిపారు. ఎన్నికల్లో ఇరువురు కలిసి పని చేయటంతో భారీ మెజార్టీతో మద్దిశెట్టి విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రెండు వర్గాలుగా ఏర్పడేందుకు దారితీసాయి.

గతంలో అద్దంకి రోడ్డులో గల వైకాపా పార్టీ ఆఫీసు వద్ద ఫ్లెక్సీలను చించి..ప్రచార రథాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఘటనకు బూచేపల్లి వర్గీయులే కారణమై ఉండొచ్చనే అనుమానంతో రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకుంది. పోలీసులు విచారణ చేపట్టి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఫ్లెక్సీలను తగలబెట్టినట్లు నిర్ధరించటంతో గొడవ అంతటితో సద్దుమణిగింది. మరోవైపు నియోజకవర్గంలో మద్దిశెట్టి వేణుగోపాల్ అవినీతికి పాల్పడుతున్నట్లుగా కొన్ని కరపత్రాలు బయటకు వచ్చాయి. ఈ పని కూడా బూచేపల్లి వర్గీయులే చేసినట్లుగా మద్దిశెట్టి వర్గం ఆరోపణలకు దిగింది. ఈ వ్యవహారంలో మద్దిశెట్టి వర్గీయులలో ఒకరు బూచేపల్లి వర్గీయులపై బూతుల దండకంతో విరుచుకుపడ్డారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ముండ్లమూరులో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసే విషయంలోనూ ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. ఇటీవల బీసీ కార్పొరేషన్ ఛైర్మన్, డైరక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక కూడళ్లలో ఫ్లెక్సీలు కట్టనీయకుండా మద్దిశెట్టి వర్గం అడ్డుపడటం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో సోమవారం జరగబోయే జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనని కార్యకర్తలు, అధికారులు, ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు.

ఇదిలా ఉండగా...సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇరు వర్గాలతో మాట్లాడి వేర్వేరు సమయాల్లో వేడుకలు నిర్వహించుకునేందుకు సమయం కేటాయించామని స్థానిక సీఐ తెలిపారు. గ్రామాల నుంచి వచ్చే వారి వారి వాహనాలకు వేర్వేరుచోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఇదీచదవండి

'పరిపాలన రాజధాని విశాఖలో.. ప్రభుత్వ భూమిలోనే కార్యాలయాలు'

ABOUT THE AUTHOR

...view details