ప్రకాశం జిల్లా ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో నాలుగురోజుల క్రితం ఓ ఆడపిల్ల అనుమానాస్పదస్థితితో మృతిచెందింది. జిల్లాలోని ఇంకుల్లు మండలం హునుమాజిపాలెంకు చెందిన కీర్తన.. ఈ నెల 14న ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమ్మాయి పుట్టిందని.. నాన్నమ్మ యేసమ్మ కోడలిని, కుమారుడిని వేధించడం ప్రారంభించింది. ఆడపిల్ల వద్దంటూ రోజూ కుమారుడితో గొడవ పడుతుందని కుటుంబసభ్యులు తెలిపారు.
గురువారం రాత్రి తన దగ్గర నుంచి యేసమ్మ పాపను బయటకు తీసుకువెళ్లి, కొంత సమయం తరువాత తీసుకువచ్చిందని కీర్తన తెలిపింది. అపస్మారక స్థితిలో ఉన్న శిశువును చూసి కంగారుపడి...తన తల్లికి చెప్పినట్టు పేర్కొంది. వాళ్లు వచ్చి పాపను వైద్యులకు చూపించారు. వారు పరీక్షలు చేసి శిశువు మృతి చెందినట్లు తేల్చారు. ఆడపిల్ల పుట్టిందని నానమ్మే చంపేసిందంటూ.. చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు.