రాష్ట్ర అటవీ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి 8 నెలలుగా జీతాలు అందని కారణంగా.. వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర అటవీ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా 217 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిని 1997లో విధుల నుంచి తొలగించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2004లో అందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం రోస్టర్ పద్ధతిలో అర్హతను బట్టి వివిధ హోదాల్లో నియమించింది. ట్రెజరీ శాఖ నుంచి నెలనెలా జీతాలు అందేవి. అయితే గత ఏడాది సెప్టెంబర్ నుంచి జీతాలు నిలిచిపోయాయి.
104 సిబ్బందికి 14 నెలలుగా వేతనాల్లేవు!
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తరఫున గతంలో 104 సంచార వైద్యశాల పథకంలో పనిచేసిన కొందరు ఉద్యోగులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నా 14 నెలల నుంచి వేతనాలు అందడంలేదు. దీనివల్ల వీరు ఆర్థికంగా చితికిపోతున్నారు. 104 సంచార వైద్యశాల నిర్వహణ బాధ్యతల మార్పిడి జరిగినప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనే ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రభుత్వాన్ని కోరారు.
వేతనాలు చెల్లించండి: రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్
బదిలీలపై నిషేధం ఉన్నా..రాజకీయ నేతల ఒత్తిళ్లు, కలెక్టర్ల సొంత నిర్ణయాల వల్ల కొందరు తహశీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులకు గత 6 నెలల నుంచి వేతనాలు అందడంలేదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. బదిలీలపై నిషేధం ఉన్నా తహశీల్దార్లు, మరో 183 మంది రెవెన్యూ సిబ్బందికి స్థానచలనం కలిగినందున వీరికి వేతనాలు చెల్లించలేమని అధికారులు చెబుతున్నారని వారు తెలిపారు. సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు.