ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ-పంట...నమోదు కాలేదంట..!

నివర్ తుపాను ధాటికి పంటలన్నీ పాడవ్వగా..రైతుల కష్టమంతా నీటిపాలైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పట్ల ఆన్​లైన్​ అవగాహన లేమితో వాటిని దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం అందించే సాయం వివరాలు చాలామందికి రైతులకు తెలీదు. పరిహారం రాక..పంట చేతికి దక్కక లబోదిబోమంటున్నారు.

By

Published : Dec 2, 2020, 7:42 AM IST

e crop   compensation problems in prakasham district
ప్రకాశం జిల్లాలో ఈ క్రాప్ సమస్యలు

పాడైన పంటను చూస్తున్న అధికారులు

ఆరుగాలం శ్రమించే రైతన్న విత్తునాటే దగ్గర నుంచి పంటను ఇంటికి తెచ్చుకునే వరకు అడుగడుగునా కష్టాలు, నష్టాలను చవిచూస్తున్నారు. పంట సాగు చేసి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వ సాయం పొందే వెసులుబాటును పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. అనువైన పంటలను సాగు చేసుకునే రైతు వాటిని ఆన్‌లైన్‌ చేసుకోవడంలో అవగాహనలేమి, నిర్లక్ష్యంతో ప్రయోజనాలను కాలరాసుకుంటున్నాడు. దీనికి తగినట్లే అధికారులు, సిబ్బంది వ్యవహారం ఉంటోంది. ఆన్‌లైన్‌ నమోదు, దాని ప్రయోజనాలను రైతులకు కూలంకషంగా వివరించాల్సింది పోయి వారికి తెలుసులే అన్నట్లు వదిలేస్తున్నారు. ఫలితంగా తెలిసిన రైతులు ఆన్‌లైన్‌ చేసుకుంటుండగా తెలియని రైతులు విపత్తుల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో రబీసాగు మొదలై రెండు నెలలైనా పంట నమోదు 50శాతం కూడా పూర్తికాలేదు. దీంతో నివర్‌ తుపాను వర్షాలకు పంట నష్టపోయిన ఆలస్యంగా ఖరీఫ్‌ సాగు చేసిన రైతులతోపాటు రబీ సాగు చేసిన రైతులు ఆవేదనలో కూరుకుపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. అన్నదాతల అవస్థలు.. జిల్లాలో రబీలో సాధారణం సాగు విస్తీర్ణం 2.42 లక్షల హెక్టార్లు. అక్టోబరు నుంచి మొదలైన రబీలో సాగు 35వేల హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగుచేశారు. అయితే ఆ మేరకు ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తికాలేదు.

ఒకవైపు పంట నమోదు మందకొడిగా సాగుతోంది. కొత్తపట్నం, వలేటివారిపాలెం తదితర మండలాల్లో 80శాతం వరకు ఈ-పంట నమోదు అయినప్పటికీ కారంచేడు, కొండెపి, జరుగుమల్లి, తాళ్లూరు, ఇంకొల్లు, పర్చూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, రాచర్ల, కంభం, యద్దనపూడి, పెద్దారవీడు, దోర్నాల, అర్థవీడు, చినగంజాం, ఉలవపాడు తదితర మండలాల్లో ఇంకా పదిశాతం కూడా పూర్తికాలేదు. యాప్‌లో సాంకేతిక సమస్యలు, ప్రక్రియ ఆలస్యంగా మొదలుకావడం, వర్షాలు తదితరాలు జాప్యానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రయోజనాలున్నా పట్టడంలేదు ఈ-పంట నమోదు ప్రక్రియతో రైతులకు అనేక ప్రయోజనాల ఉన్నాయి. పంట నష్ట పరిహారం, బీమా, ప్రభుత్వ సంస్థల్లో దిగుబడులు అమ్ముకోవాలన్నా, విత్తనాల పంపినీ, రాయితీ పథకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.

అయితే కొందరు రైతులు అవగాహన లేక, కార్యాలయాల చుట్టూ తిరగలేక పంటల సాగు వివరాలను ఆన్‌లైన్లో నమోదుకు చివరి వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. తీరా విపత్తులు వచ్చినప్పుడు పంట నష్టపోయి ఆందోళన చెందుతున్నారు. దీంతో అటు అధికారులు కూడా ఆసమయంలో ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీనిపై రైతులు కూడా అవగాహనతో ఉండాలి. భూమి సర్వేనెంబరు, ఆధార్, ముబైల్‌ నెంబరు, పంట పేరు, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో కూడిన పత్రాలు ఇచ్చి నమోదు చేసుకుని తర్వాత సరిచూసుకోవాలి.

కంభం మండల పరిధిలోని నల్లకాలువ, యర్రబాలెం, నర్సిరెడ్డిపల్లి, తురిమెళ్ల గ్రామాల్లో ని రైతుల పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేయలేదని స్థానిక ఎమ్మెల్యే అన్నారాంబాబు దృష్టికి తీసుకొచ్చారు. అన్ని సదుపాయాలు ఉన్నా రైతులు సాగు చేసిన పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేయరా...పైగా రైతుల నుంచి డబ్బులు తీసుకుంటారా..మీ కారణంగా పంట నష్టపోయి పరిహారం పొందలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంటుందో తెలుసా అని నిలదీశారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. ఇది ఒక కంభం మండలంలోని రైతులదే కాదు జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన అన్ని చోట్ల రైతులు లబోదిబోమంటున్నారు.

కంభం మండలానికి చెందిన ఓ రైతు ఆలస్యంగా ఖరీఫ్‌ సాగులో భాగంగా పొలం కౌలుకు తీసుకుని నాలుగు ఎకరాలు వరి నాటాడు. నివర్‌ వర్షాలకు పంట నీట మునిగింది. ఈ-క్రాప్‌కు ఇదివరకే పత్రాలు ఇచ్చి ఉండటంతో ప్రభుత్వ పరిహారం వస్తుందన్న ఆశలు పెట్టుకున్నాడు. రెండు రోజుల క్రితం సచివాలయానికి వెళ్లి ఆరాతీయగా ఆన్‌లైన్లో డేటా పోయిందన్న సమాధానంతో సదరు రైతు తీవ్ర ఆవేదనలో మునిగాడు.

కనిగిర మండలానికి చెందిన రైతు వెంకటరామిరెడ్డి కౌలుకు తీసుకుని రబీలో ఎనిమిది ఎకరాల్లో మినుము పంట సాగు చేశాడు. నివర్‌ తుపాను కారణంగా పంట నీట మునిగింది. పంటకు సంబంధించి ఈ-క్రాప్‌ నమోదుకు పత్రాలు అన్ని అందజేశారు. పరిహారం అందుతుందన్న ఆశతో ఆరా తీయగా ఇప్పటి వరకు ఆన్‌లైన్లో నమోదు కాలేదని తెలిసి ఆవేదన చెందారు. మళ్లీ సచివాలయ సిబ్బంది, వాలంటీర్‌ను సంప్రదించగా ఇప్పుడు నమోదు చేస్తామని చెబుతున్నారని, చివరకు ఏమవుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.

10లోపు అన్నీ పూర్తిచేస్తాం

జిల్లాలో ఖరీఫ్‌ పంటకు సంబంధించి 99 శాతం ఈ-పంట నమోదు పూర్తి చేశాం. రబీ సాగుకు సంబంధించి ఇప్పటి వరకు 40శాతం పూర్తి అయింది. యాప్‌ ఆలస్యంగా రావడం, నమోదు ప్రక్రియకు అయిదు రోజులు అంతరాయం కలగడంతో కొంత జాప్యం అయింది. పదో తేదీలోపు నష్టపోయిన పంట వివరాలతోపాటు ఆ పంటకు సంబంధించి ఈ-పంట నమోదు ప్రక్రియను కూడా పూర్తిచేస్తాం. ఎవరైనా పంట నమోదు చేసుకోనివారు, ఆన్‌లైన్‌ నమోదులో ఇబ్బందులున్న రైతులు సమీపంలోని రైతుభరోసా కేంద్రాలు, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ-పంట నమోదు చేయించుకోవాలి

-శ్రీరామమూర్తి, జేడీఏ

ఇదీ చూడండి.విజయవాడ-గుడివాడ రోడ్డు అధ్వానం...పాలకులకు పట్టని వైనం

ABOUT THE AUTHOR

...view details