granite transportation: గ్రానైట్ ఖనిజానికి పేరుగాంచిన ప్రకాశం జిల్లాలో వాటి కటింగ్, పాలిషింగ్ యూనిట్ల యజమానులకు, గనుల శాఖకు పోరు కొనసాగుతోంది. ప్రభుత్వ, గనుల శాఖ తీరుకు నిరసనగా ఇటీవల యూనిట్లు మూసేస్తామని హెచ్చరించిన యజమానులు ఓ మంత్రి హామీతో వెనక్కి తగ్గారు. గనులశాఖ గతంలో ఇచ్చిన తాఖీదుల ఆధారంగా ఇపుడు గ్రానైట్ స్లాబ్స్ తరలించేందుకు అవసరమైన పాస్ల జారీ నిలిపేయడంతో మళ్లీ వివాదం రాజుకుంది. కొద్ది నెలల కిందట ప్రభుత్వం అన్ని ఖనిజాలకు కన్సిడరేషన్ మొత్తాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా గ్రానైట్కు సీనరేజ్ విలువలో 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
దీనివల్ల ముడిరాయి ధర పెరిగింది. విద్యుత్ ఛార్జీలు కూడా పెరగడంతో ఈ నెల 15 నుంచి యూనిట్లు నిలిపేసేందుకు యజమానులు సిద్ధమయ్యారు. ఆ జిల్లా మంత్రి హామీతో యూనిట్లు కొనసాగిస్తున్నారు. తాజాగా ఒంగోలులోని గనులశాఖ అధికారులు జిల్లాలోని దాదాపు 250 యూనిట్లకు చెందిన ఐడీలు నిలిపేసి, మైనింగ్ పాస్ల జారీ కూడా ఆపేశారు. గతంలో ఆయా యూనిట్లను తనిఖీలు చేసినప్పుడు ఉల్లంఘనలు గుర్తించి, జరిమానా చెల్లించాలంటూ అధికారులు డిమాండ్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి నోటీసులున్నప్పుడు పాస్లు, పర్మిట్లు జారీ చేయకూడదు. రెండు, మూడేళ్లుగా ఈ యూనిట్లకు పాసులు జారీ చేస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన గనులశాఖ అధికారులు.. ఇటువంటి యూనిట్లకు పాస్ల జారీ ఆపేశారు. డిమాండ్ నోటీసు ప్రకారం జరిమానా చెల్లించాలని, లేకపోతే గనులశాఖ మంత్రి వద్ద సమీక్షకు దరఖాస్తు చేసి, కనీస మొత్తం చెల్లించాలని సూచించారు.