జనసంద్రమైన బయోమెట్రిక్ కేంద్రాలు ఈ దృశ్యం చూస్తుంటే..కొత్తగా జనాలకు కరోనా అంటే భయం వేసి టీకాల కోసం ఎగబడుతున్నారనుంటున్నారా? ఊ కాదు. షాప్ ఓపెనింగ్కు, సినిమా హీరోనో..హీరోయిన్ వచ్చిందేమో జనం ఎగబడుతున్నారనుకుంటున్నారా? కాదు. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు వచ్చారనుకుంటున్నారా? అబ్బే కాదు. మరి జనాలెందుకు ఇంతలా తోసుకుంటూ..గోడ దూకుకుంటూ..ఎగబడుతున్నారూ? సామాన్య జనాలకుండే తిప్పలే ఇవీ.. ఇంతకీ విషయం ఏమంటే..రేషన్ కార్డుకు..ఆధార్ ఈకేవైసీ లింక్ చేయాలనే నిబంధన పెట్టారుగా మన సర్కారు వారు..అందుకు ఈ జనం ఇక్కడ ఎగబడుతున్నారు.
కోడి కూయకముందుకే ఇలా బయోమెట్రిక్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇందులో చిన్నారులూ ఉన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం లో తపాలశాఖ కార్యాలయం వద్దదీ దృశ్యం.
మార్కాపురం ఆంధ్రాబ్యాంక్, సిండికేట్ వద్ద గత నాలుగు రోజులుగా బయోమెట్రిక్ కోసం చిన్నారులతో వారి కుటుంబ సభ్యులు వచ్చి వెళుతున్నారు. అయినా పని కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏదో ఒక పరిష్కారం చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. చిన్నారుల బయోమెట్రిక్తో పాటు, పింఛన్దారులకు ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ కావాలని వాలంటీర్లు చెప్పడంతో వారు కూడా అధికసంఖ్యలో ఆధార్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
మార్కాపురం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి తెల్లవారుజామునే వచ్చి వివిధ బ్యాంకుల వద్ద వేచి ఉంటున్నారు. కానీ బ్యాంక్ వారు రోజుకు ఇరవై మందికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. విషయం తెలియని వృద్ధులు ప్రతిరోజూ వచ్చి పడిగాపులు కాస్తున్నారు. ఓ వైపు కొవిడ్-19 కారణంగా వృద్ధులను ఇంట్లోనే ఉండమని అధికారులు సూచిస్తున్నారు. కానీ వారికి వచ్చే జగనన్న పింఛను కోసం మాత్రం వారిని ఇలా తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వృద్ధుల కష్టాలు అర్థం చేసుకుని స్థానిక సచివాలయాల్లో వాలంటీర్ ద్వారా ఆధార్ సేవలు కొనసాగించాలని వారు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:PROBLEMS: రేషన్ ఆధార్ అనుసంధానానికి అగచాట్లు