ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 17, 2020, 11:16 AM IST

Updated : Jul 17, 2020, 11:50 AM IST

ETV Bharat / state

అక్రమ నగదు తరలింపు... మంత్రి బాలినేని చుట్టూ వివాదం

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే స్టిక్కరుతో ఉన్న కారులో చెన్నైలో భారీగా నగదు పట్టుబడింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపింది. ఆ స్టిక్కరు మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డికి సంబంధించినదని ప్రతిపక్షాలు విమర్శలకు పదునుపెట్టాయి. మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు చెన్నైలో పట్టుబడ్డ కారు ఎవరిది..? ఆ స్టిక్కర్ ఎలా వచ్చింది..? ఇలా ఎన్నిసార్లు నగదు అక్రమంగా తరలించారు..? అనే ప్రశ్నల చిక్కుముడి వీడాల్సింది ఉంది.

అక్రమ నగదు తరలింపు... మంత్రి బాలినేని చుట్టూ వివాదం
అక్రమ నగదు తరలింపు... మంత్రి బాలినేని చుట్టూ వివాదం

ప్రకాశం జిల్లా ఒంగోలు బంగారు వర్తకుడు నల్లమల్లి బాలుకు చెందిన నగదు చెన్నైలో పట్టుబడటంతో ఐటీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. నగదు తనేదే అని ప్రకటించడంతో పాటు, తగిన రికార్డులు అధికారులకు అందజేసే విషయంలో వ్యాపారి తమిళనాడు వెళ్లినట్లు సమాచారం. ఆ వ్యాపారికి చెందిన సంస్థలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిస్తోంది.

రైళ్లు లేక రోడ్డు మార్గంలో

ప్రకాశం జిల్లాలో బంగారు వ్యాపారమంతా తమిళనాడుతో సంబంధాలు కలిగిఉంటాయి. నగలు, నగదు లావాదేవీలన్ని రైలు మార్గంలో కొంతమంది మధ్యవర్తుల సహకారంతో జరుపుతుంటారు. రైలులో నగదు విషయంలో పెద్దగా తనిఖీలు ఉండవు కనుక ఐటీ అధికారులు కళ్లుగప్పి నగదు తరలిస్తుంటారు. అయితే లాక్ డౌన్ వల్ల రైళ్లు పరిమితంగా తిరుతుండడంతో రహదారి మార్గంలో నగదు తరలిస్తున్నారు. తమిళనాడు సరిహద్దులో ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ వాహనాన్ని, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాన్ని వినియోగిస్తుంటారు.

వివాదంలో ఇరుకున్న మంత్రి

ఇందులో భాగంగానే బంగారు వ్యాపారి నల్లమిల్లి బాలు ఇలానే వాహనాలను వినియోగించినట్లు తెలుస్తోంది. అయితే తాజా సంఘటనతో రాజకీయ అంశం కూడా చర్చినీయాంశం అయ్యింది. ఎమ్మెల్యే స్టిక్కర్ కలిగిన వాహనంలో రూ. 5.2 కోట్లు నగదు లభించడం సంచలనం రేపింది. బంగారు వర్తకుడు నల్లమల్లి బాలు ఒంగోలు ఎమ్మెల్యే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడు కావడం, వైకాపా తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండటంతో ఈ వ్యవహారం మంత్రి చుట్టూ తిరుగుతుంది. మంత్రికి, ఈ నగదును ఎలాంటి సంబంధం లేదని, ఈ నగదు తన వ్యాపారాన్ని సంబంధించినది అని నల్లమల్లి బాలు ప్రకటించారు.

స్టిక్కర్లు ఎక్కడివి?

రాజకీయ ప్రతినిధుల వాహన స్టిక్కర్లపై ఇప్పుడు చర్చసాగుతుంది. ప్రజాప్రతినిధుల అనూయయులు, బంధువులు, పీఏలు, కుటుంబ సభ్యులు.. ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లు గల వాహనాలను ఉపయోగిస్తుంటారు. ఈ స్టిక్కరు ఉంటే ట్రాఫిక్ లో సైతం నిబంధనలు అతిక్రమించి వెళ్లడం, పోలీసులు ప్రత్యకంగా ఈ వాహనాలకు గుర్తింపు ఇస్తుంటారు. కానీ ఈ స్టిక్కర్లు అడ్డం పెట్టుకుని అక్రమాలు, దందాలు చేస్తున్న వైనం గతంలోనూ వెలుగుచూశాయి. తాజాగా మంత్రి బాలినేని... ఎమ్మెల్యే స్టిక్కరు ఉన్న కారులో భారీగా నగదు పట్టుబడడం సంచలనం అయ్యింది.

మంత్రి వివరణ

నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలకు మూడు, ఎమ్మెల్సీలకు రెండు చొప్పున వాహనాలు పాస్ లు (స్టిక్కర్లు) శాసన సభ/మండలి కార్యదర్శిలు మంజూరు చేస్తారు. అయితే ఈ పాస్ లను కలర్ ఫొటో కాపీలు తీసి ఎమ్మెల్యే అనుయాయులు వాడుతుంటారు. చెన్నైలో పట్టుబడ్డ వాహనంపై ఫొటో కాపీ స్టిక్కరు కూడా ఇలాంటిదే అని మంత్రి బాలినేని అంటున్నారు.

అనుమానాలు

గతంలో ఇలా ఎన్ని సార్లు అక్రమ నగదు రవాణా జరిగింది? ఎన్ని సార్లు ఎమ్మెల్యే స్టిక్కరు వినియోగించుకున్నారు?.. అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు ఈ నగదు బంగారం వ్యాపారానికి సంబంధించిదేనా, లేదా ఇతర వ్యవహారాలకు సంబంధించినదా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదీ చదవండి :'భవనంపై నుంచి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించు..'

Last Updated : Jul 17, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details