ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సున్నా వడ్డీ పథకంతో.. కోటి రెండు లక్షల మందికి లబ్ధి : జగన్

YSR Zero Interest Loan Scheme 2022: అక్కాచెల్లెళ్లలకు ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి జగన్​ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్​ఆర్​​ సున్నా వడ్డీ పథకం మూడో విడత సొమ్మును బటన్‌ నొక్కి జగన్​ విడుదల చేశారు. మూడో విడతలో భాగంగా రూ. 1,262 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అర్హుల ఖాతాల్లో జమచేశారు.

By

Published : Apr 22, 2022, 5:14 PM IST

YSR Zero Interest Loan Scheme
YSR Zero Interest Loan Scheme

ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్​​ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధులను బటన్‌ నొక్కి సీఎం జగన్​ విడుదల చేశారు. రూ. 1,262 కోట్ల సున్నా వడ్డీ రాయితీని మహిళల ఖాతాల్లో వేశారు. గత 35 నెలల్లో రూ. లక్షా 36వేల కోట్లను వివిధ పథకాల రూపంలో ప్రజల ఖాతాల్లోకి జమచేసి, వారి ఆర్థిక స్థితిగతులను మార్చేసామని జగన్​ అన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన మోసాల వల్ల డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యమయ్యాయని జగన్​ విమర్శించారు. సున్నావడ్డీ మాట అటుంచితే.. అధిక వడ్డీలు చెల్లించుకోవాల్సి వచ్చేదన్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక.. 12 శాతం పైబడి ఉన్నవడ్డీ రేటును ఆరున్నర శాతానికి తగ్గించామన్నారు. అంతేకాక సకాలంలో తమ రుణాలు చెల్లించే స్థితికి చేరుకోవడంతో ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ రాయితీ కల్పిస్తున్నామని తెలిపారు. మూడేళ్లలో మొత్తం రూ. 3,616 కోట్ల వడ్డీరాయితీ జమచేశామని.. అనుకున్న సమయానికి వడ్డీ రాయితీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తామని అన్నారు. దీంతో కోటి రెండు లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

మాట్లాడుతున్న సీఎం జగన్

వైకాపా హయాంలో సంఘాలు పునర్జీవనం పోసుకున్నాయని.. ఆర్థిక పురిపుష్టిసాధించి, కళకళలాడుతున్నాయన్నారు. ఇది అక్కా చెల్లెళ్ల విజయగాధ.. ప్రభుత్వం విజయగాధ.. అని చెప్పారు. అయితే.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని కొందరు పథకాలను ఆపే కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. సంక్షేమం అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని అంటున్నారని.. నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బు జమ చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా ఎందుకు మారుతుందో చెప్పాలని అన్నారు. ఇలా కాకుండా.. ప్రజల సొమ్మును జేబుల్లో వేసుకుంటే అమెరికా అవుతుందా? అని ప్రశ్నించారు. ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్న జగన్..​ ఇలాంటి ప్రచారాలు చేస్తున్న రాక్షసులకు, దుర్మార్గులకు బుద్ధి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, వైఎస్​ఆర్​ సంపూర్ణ పోషణ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వైఎస్ఆర్​ చేయూత, ఆసరా వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కరోనా వైరస్‌.. రాష్ట్రాన్ని పీడించినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ఇబ్బంది పడకూడదనే పథకాల ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాం. మా ప్రజా ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా.. దుష్టచతుష్టయం అడ్డంకులు సృష్టిస్తోంది. చంద్రబాబు సమయంలోనూ ఇదే ఆదాయం, ఇవే అప్పులు.. ఇప్పుడూ అదే ఆదాయం, కొంచెం తక్కువ అప్పులు. కానీ అప్పుడు అమలు చేయలేని పథకాలు, అభివృద్ధిని ఇప్పుడు చేసి చూపిస్తున్నాం. సామాజిక న్యాయం మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, బీసీ, ఎస్టీలకు సముచితస్థానం ఇచ్చి సామాజిక న్యాయం చేశాం. -జగన్​, ముఖ్యమంత్రి

కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ముత్యాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఒంగోలులో వైకాపా నాయకులు రవిశంకర్‌ ఇంటికి వెళ్లిన జగన్​.. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు.

ఇదీ చదవండి:ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తే.. రాష్ట్రం శ్రీలంకగా మారుతుందా?: జగన్‌

ABOUT THE AUTHOR

...view details