ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్టీరింగ్ వదిలి... సాగుకు కదిలి..

By

Published : Sep 25, 2020, 7:08 PM IST

గతంలో ఆయనో లారీ డ్రైవర్. వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. రోజూ సుదూర ప్రాంతాలు తిరగడం వల్ల ఆరోగ్యం కూడా సహకరించేది కాదు. వ్యవసాయంపై మక్కువ ఉన్న అతను.. పొలం కొనుగోలు చేసి ప్రకృతి సాగు వైపు కదిలాడు. దాదాపు 10 ఏళ్లుగా అదే బాటలో 'సాగు'తున్నారు. అంతేకాకుండా తన చిన్న ఇంటిని మొక్కలతో నందనవనంగా మార్చేశారు.

farmer
farmer

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని పాదర్తి గ్రామానికి చెందిన రామారావు ఇంటికి వెళ్లితే ఎవరి మనసైనా పులకరించిపోతుంది. సామాన్య రైతు నివసించే రేకుల షెడ్డు... నందనవనాన్ని తలపిస్తుంది. ఎన్నో రకాల మొక్కలు అక్కడ కనువిందు చేస్తాయి. ఆ ఇంటిని చూస్తే అర్థమవుతుంది రామారావు ఓ ప్రకృతి ప్రేమికుడని. 10వ తరగతి వరకు చదువుకున్న ఈయన... గతంలో ఓ లారీ డ్రైవర్. వ్యవసాయంపై మక్కువతో కొన్నేళ్ల క్రితం పొలం కొనుగోలు చేశాడు. అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

రసాయనాలు లేకుండా....

రామారావు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తీసుకున్నాడు. ఓ ఆవును పెంచుకుంటూ దాని పేడతో ఎరువులు, జీవామృతాలు తయారు చేసి తన పంటకు వినియోగిస్తున్నారు. వివిధ రకాల కషాయాలు తయారు చేసి పంటకు వాడుతున్నారు. అంతే కాదు ఆవు పేడతో వచ్చే పిడకలను వంటచెరకుగా వినియోగించటంతో పాటు, కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు కలిపి టూత్ పౌడర్, షాంపోలు వంటివి కూడా తయారు చేస్తారు. వీటిని తోటి రైతులకు విక్రయిస్తున్నారు.

తోటి రైతులకు అవగాహన

ఎలాంటి పెట్టుబడిలేని వ్యవసాయం కాబట్టి తనకు ఎంత దిగుబడి వచ్చినా గిట్టుబాటుగానే ఉంటుందని రామారావు చెప్పారు. కషాయాల వల్ల కూడా కొంత ఆదాయం లభిస్తుందని ఆయన అంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారికీ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుతున్నానని ఆయన చెప్పారు. ప్రకృతి సాగు విధానం అనుసరించడం వల్ల తాను ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ప్రకృతికి తనవంతు మేలు చేస్తున్నాడు.

ఇదీ చదవండి: 59వ ఏట బ్రూస్లీలా రఫ్పాడిస్తున్న పూజారి

ABOUT THE AUTHOR

...view details