ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 2, 2019, 8:25 PM IST

ETV Bharat / state

పల్లె గొంతెండుతోంది... జనానికి నరకం కనబడుతోంది!

ఒక వైపు భూగర్భజలాలు ఎండిపోతున్నాయి....మరోవైపు బోర్లు, బావుల్లో నీరు అడుగింటిపోతుంది...బిందె నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి...గుక్కెడు నీరు దొరక్క కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఇది నెల్లూరు జిల్లా ఆత్మకూరు వాసుల నీటి కష్టాలకు నిలువెత్తు నిదర్శనం.

నెల్లూరు జిల్లా మహిమలూరు

పల్లె గొంతెండుతోంది...!

భూగర్భ జలాలు ఎండిపోయి భూమిలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల... బోర్లు, బావుల్లో నీరు అడిగింటిపోతున్నాయి. ఈ పరిస్థితితో తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు ప్రజలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు ఎస్సీ కాలనీ, బండ్లపల్లి ఖాన్ సాహెబ్ పేట, రామస్వామి పల్లి గ్రామాలలో గుక్కెడు నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బిందె నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్ళలేని వారు నీటిని డబ్బులు పెట్టి కొనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మహిమలూరు గ్రామంలో సుమారు 3000 మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ నీటి అవసరాలు తీర్చేందుకు నాలుగు ట్యాంకులు ఉన్నాయి. వాటిలో నీరు మాత్రం లేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉన్న రెండు ట్యాంకుల్లో నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. మిగతా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా.. పది రూపాయలు క్యాను కొనుక్కుని మరీ వాడుకుంటున్నారు.

ఈ సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు. నీళ్లు రాకపోయినా కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా తమ ప్రాంతాలకు సరఫరా చేసి సమస్య పరిష్కరించాలని బాధిత ప్రజలు వేడుకుంటున్నారు.

ఇవి చదవండి...దూకుడు పెంచుదాం... దరి చేరుదాం!

ABOUT THE AUTHOR

...view details