ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 25, 2020, 10:43 AM IST

ETV Bharat / state

రోడ్డు విస్తరణ పేరుతో భారీ వృక్షాలను పెకిలిస్తున్నారు

వృక్షో రక్షిత రక్షితః అన్న నానుడి అధికారులకు పట్టడం లేదు. అభివృద్ధి పేరుతో నెల్లూరూ నగరంలో భారీ వృక్షాలను నేలకూలుస్తున్నారు. దశాబ్దాలుగా పెరిగిన వృక్షాలను కూకటివేళ్లతో సహా పెకిలించేస్తుండడంతో ప్రకృతి ప్రేమికులు కంటతడి పెడుతున్నారు.

nellore city
nellore city

వృక్షాలను మనం రక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయన్నది పెద్దలమాట. అయితే నెల్లూరు నగరంలో మాత్రం అభివృద్ధి పేరుతో దశాబ్దాల నాటి చెట్లు నేలకూలుతున్నాయి. నగరంలోని పొదలకూరు రోడ్డులో రహదారికి ఇరువైపులా ఉన్న వృక్షాలు ఆహ్లాదకర వాతావరణం అందించడమే కాకుండా ప్రయాణికులకు నీడనిచ్చేవి. 50, 60 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు భారీ వృక్షాలై బాటసారులకు సేదతీర్చాయి. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం రోడ్డు విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టడంతో, దశాబ్దాల వయసున్న వృక్షాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

పొదలకూరురోడ్డు లోని డి.కె.డబ్ల్యూ. కళాశాల నుంచి డైకస్ రోడ్డు వరకు రహదారి విస్తరణ పనులను అధికారులు రెండేళ్ల క్రితమే చేపట్టారు. దాదాపు పది కోట్ల రూపాయల వ్యయంతో అప్పట్లో పనులు ప్రారంభించిన అధికారులు, ఓ వైపు చెట్లను తొలగించి పనులు పూర్తి చేశారు. నగరంలో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో అప్పట్లో ఈ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం తిరిగి ఈ పనులు ప్రారంభించిన ఆర్. అండ్ బి. అధికారులు విస్తరణ కొసం భారీ వృక్షాలను నెలకొల్చుతున్నారు. ఏళ్ల తరబడి నీడనిచ్చిన వందలాది చెట్లును యంత్రాలతో పెకలించేయడంతో అవి నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్లపై పడి ఉన్న ఈ చెట్లను చూస్తున్న ప్రకృతి ప్రేమికులు తమ ఆవేదనను వెలుబుచ్చుతున్నారు.

ట్రాఫిక్ రద్దీని నివారించేందుకే...

పెరుగుతున్న జనాభా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఆర్.అండ్.బి. అధికారులు చెబుతున్నారు. ఈ పనులను నాలుగు నెలల్లో పూర్తి చేసి, రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేసి, అక్కడ చెట్లు నాటుతామని అధికారులు తెలియజేస్తున్నారు. రహదారి విస్తరణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే చెట్లు తొలగించామని అంటున్నారు.

చెట్లను సంరక్షించాలని పదే పదే చెప్పే అధికారులే ఇలా చేయడం భావ్యం కాదంటున్న ప్రకృతి ప్రేమికులు... చెట్లను పరిరక్షించాలని కోరుతున్నారు. అందుకు సంబంధించిన చర్యలను తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి

'రూ.వేలు పెట్టుబడి పెట్టినా... వడ్ల గింజ కూడా దక్కలేదు'

ABOUT THE AUTHOR

...view details