ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ISRO: ఈ ఏడాది తొలిదశ ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ సీ- 52 - PSLV C-52 launch from Satish Dhawan Space Center

PSLV C-52 Rocket launch: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చాలా రోజుల తర్వాత మరో రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. వాతావరణం అనుకూలిస్తే.. ఈనెల 14న మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-52 వాహక నౌకను ప్రయోగించనున్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-52 వాహక నౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ISRO
ISRO

By

Published : Feb 12, 2022, 9:49 AM IST

PSLV C-52 Rocket launch: నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చాలా రోజుల తర్వాత.. మరో రాకెట్ ప్రయోగించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఏటా 15ప్రయోగాలు చేయాలన్నది ఇస్రో లక్ష్యం కాగా... ఈ మేరకు షార్ లో మౌలికవసతులు కల్పించారు. అయితే కొవిడ్ నేపథ్యంలో ఆ మేరకు ప్రయోగాలకు వీలు పడలేదు. సాధారణ రోజుల్లో ఏడాదికి 8నుంచి 12 ప్రయోగాలు చేసేవారు. కానీ కరోనా కారణంగా 2020నుంచి వేగం తగ్గింది. కొవిడ్​తో రెండేళ్ల కాలంలో నాలుగు ప్రయోగాలు మాత్రమే చేపట్టారు. 2020 నవంబరు 7న పీఎస్‌ఎల్‌వీ సీ- 49ని నింగిలోకి పంపారు. 2020 డిసెంబర్ 17న పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగం 2021 ప్రారంభంలో పీఎస్‌ఎల్‌వీ సీ-51తో సత్తా చాటారు. తర్వాత కొవిడ్​తో ప్రయోగాలకు ముందడుగు పడలేదు.

నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ సీ- 52...

కొత్త ఏడాదిలో కొవిడ్ సవాళ్లను అధిగమించి తొలి ప్రయోగం సోమవారం పీఎస్‌ఎల్‌వీ సీ- 52 మొదటి ప్రయోగ వేదిక నుంచి శాస్త్రవేత్తలు సమాయత్తం అవుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే.. ఈనెల 14న మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-52 వాహక నౌకను ప్రయోగించనున్నారు. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ ఈనెల 13న వేకువజామున 4.29 గంటలకు ప్రారంభమవుతుంది. నిరంతరాయంగా 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఐఆర్‌శాట్-1-ఏతో పాటు ఐఎన్‌ఎస్‌-2-టి.డి, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-52 మోసుకెళ్లనుంది.

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు...
తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-52 వాహకనౌక ప్రయోగం సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయంకు చేరుకున్న శాస్త్రవేత్తలు.. వాహకనౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి... తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీ‌వారి కోట నుంచి రాకెట్ ప్రయోగంకు ముందు స్వామివారి ఆశీస్సులు పోందడం ఆనవాయితీగా వస్తోంది.


ఇదీ చదవండి:

CBN: ధైర్యం ఉంటే.. జగన్ ఆ పని చేయగలరా ?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details