ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలకు నిలయాలుగా గ్రంథాలయాలు!

జ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారవుతోంది. కనీస సౌకర్యాలు లేకపోవటంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో సమస్యలు పేరుకుపోయాయి. కొన్నేళ్ల క్రితం డిజిటలైజేషన్‌కు ప్రతిపాదనలు రూపొందించినా పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది.

By

Published : Nov 21, 2020, 6:43 AM IST

Problems have accumulated in libraries across Nellore district
Problems have accumulated in libraries across Nellore district

సమస్యలకు నిలయాలుగా గ్రంథాలయాలు!

నెల్లూరు జిల్లాలో మొత్తం 61 గ్రంథాలయాలున్నాయి. జిల్లా కేంద్రంలో పెద్ద గ్రంథాలయం ఉంది. అన్నిచోట్లా సమస్యలే తాండవిస్తున్నాయి. ప్రధానంగా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్కో గ్రంథపాలకుడికి అదనపు బాధ్యతలున్నాయి. కొన్నేళ్ల క్రితం చేపట్టిన నియామాకాలతోనే సాగదీస్తున్నారు. పలుచోట్ల అద్దె భవనాల్లో నిర్వహిస్తుంటే మరికొన్నిచోట్ల గ్రంథాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి.

ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని నిర్వాహకులు అంటున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల గ్రంథాలయాలను ఏర్పాటు చేశారని... అవి పూర్తిగా పాడయ్యాయని చెబుతున్నారు. రాపూరు, చిల్లకూరు, మైపాడు, అల్లూరు, అనంతసాగరం మండల కేంద్రాల్లో వర్షాలకు గదుల నుంచి నీరు చిమ్ముతోంది. చాలా పుస్తకాలు చెదలు పట్టి, వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి. మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేక దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాఠకులు వాపోతున్నారు.

గ్రంథాలయాలకు రావాల్సిన సెస్ వసూలు కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లా మొత్తంగా రోజుకు 10 వేల మంది గ్రంథాలయాలను వినియోగించుకుంటున్నారు. వీరంతా గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేయాలని కోరుతున్నారు. గ్రంథాలయాలను ఇన్ని సమస్యలు వెంటాడుతున్నా వారోత్సవాలు జరుపుకుంటే ఉపయోగం ఏంటని పాఠకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే స్పందించి గ్రంథాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి

ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరేనా?

ABOUT THE AUTHOR

...view details