ఆ యువ జంటది మంచి మనసు. తమ వివాహం సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. అయితే మనుషులకు కాదు.. మూగ జీవాలకు. అవును మూగజీవాలకే వివాహ విందు. నెల్లూరు నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో మహా వీరు జైన్ మూగ జీవాల హోమ్ ఉంది. అక్కడ పశువులు, కుక్కలు, కోతులు, పక్షులు ఉన్నాయి. 20 ఏళ్లుగా ఈ కేంద్రం కొనసాగుతుంది. అయితే వాటికి తిండి సరిగా ఉండటం లేదు.
చెన్నైకి చెందిన నిఖిల్, రక్ష ఇక్కడ పరిస్థితి తెలుసుకున్నారు. తమ పెళ్లి సందర్భంగా ఏదైనా చేయాలని అనుకున్నారు. జైన్ లు మూడు రోజులు వేడుకను నిర్వహిస్తారు. కనీసం 10లక్షలు ఖర్చు అవుతుంది. లాక్ డౌన్ కారణంగా అనుమతి లేదు. సాదాసీదాగా వేడుక చేసుకున్నారు. మూగ జీవాలకు అన్ని రకాలుగా రుచి చూపించాలనుకున్నారు. మూడు రోజులపాటు జంతువుల ఆహారానికి ఖర్చయ్యే సొమ్మును మహా వీరు జైన్ మూగ జీవాల హోమ్ నిర్వాహకులకు అందజేశారు. పచ్చి గడ్డి, పుచ్చకాయలు, టమోటలు, ఆకుకూరలు.. ఇలా.. 20 రకాలు పెట్టారు. ఎంతో ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో తీశారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.