Funds Misuse In ApparaoPalem : వైఎస్సార్సీపీ బలంగా ఉందని చెప్పుకునే నెల్లూరు జిల్లాలో పలు చోట్ల విభేదాలు మొదలైయ్యాయి. మండలాల్లో గ్రూపులు ఏర్పడ్డాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోనూ తరచూ విభేదాలు బయటకు వస్తున్నాయి. ఆత్మకూరు మండలం అప్పారావు పాలెంలో శనివారం రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారని వైఎస్సార్సీపీలోని రెండో వర్గం ఆరోపణలతో రోడ్డుకెక్కారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావు పాలెం పంచాయితీలో ఇరిగేషన్ పనుల్లో పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల నిధులు స్వాహా చేశారంటూ వైఎస్సార్సీపీలో అసమ్మతి వర్గం ఆరోపణ చేసింది. పంట కాలువ పనుల్లో కనీస నాణ్యత పాటించడం లేదని, పూడిక సరిగా తీయడం లేదని, చేసిన పనులే తిరిగి చేస్తూ నిధులు కాజేస్తున్నారనీ వైఎస్సార్సీలోని వర్గం ఆరోపణలు చేస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసేందుకు వచ్చిన అధికారులు ఎదుట వైఎస్సార్సీపీలోని రెండు వర్గాలు బాహాబాహీగా తలపడ్డారు.
"వర్షాల కారణంగా రోడ్లు పాడైపోయాయి. వాటిని బాగు చేయకుండా చేసినట్టుగా కోటీ 50 లక్షలు బిల్లులు పెట్టుకున్నారు. స్పందనలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. విచారణ కోసం అధికారులు వస్తే జడ్పీటీసీ భర్త పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు ఎస్సీ వాళ్లను తీసుకు వచ్చి గొడవకు దిగారు."- స్థానికుడు