ప్రభుత్వంఈ ఏడాది జనవరి నెల నుంచే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించడంతో నెల్లూరు జిల్లాలో రైతులు ఆనందించారు. గతేడాది కంటే కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచి... 179 చేయడంతో కొనుగోళ్లు పెరిగాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, చెల్లింపుల్లో మాత్రం ప్రారంభం నుంచి జాప్యం జరుగుతూనే ఉంది. స్థానిక ఎన్నికల హడావుడి, లాక్డౌన్.. ఆ తరువాత ఖరీఫ్, రబీ సీజన్ల మార్పిడితో పలుమార్లు అంతరాయాలేర్పడ్డాయి.
ఈ నెల 20వరకు కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు...
- ధాన్యం విక్రయించి నగదు పొందిన రైతులు 10,761
- విక్రయించిన ధాన్యం (టన్నుల్లో) 2,28,416
- పొందిన ధనం (రూ. కోట్లలో) 418.27
- ధాన్యం విక్రయించి నగదు పొందని రైతులు 2,324
- విక్రయించిన ధాన్యం (టన్నుల్లో) 59,343
- అందాల్సిన మొత్తం (రూ. కోట్లలో) 108.43
నెలరోజులు దాటినా..
గతనెలలో ధాన్యం విక్రయించిన రైతులకు ఇప్పటికీ చెల్లింపులు జరగలేదు. వారు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా సమాధానం చెప్పేవారు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను కలిసి సమస్య విన్నవించినా వారినుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.