An attempt to encroach on the crematorium: రెండు శతాబ్దాలుగా శ్మశానవాటికగా ఉన్న స్థలాన్ని కాపాడుకునేందుకు గ్రామస్థులు దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. అధికారులు మారినా.. అర్జీలు ఇవ్వడం మానలేదు. కోట్ల విలువైన స్థలంపై కబ్జాదారులు కన్నేశారని.. రికార్డులు తారుమారు చేసి కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీ.సీ.పల్లిలో శ్మశానవాటికను కాపాడుకోవడం కోసం స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామం పుట్టినప్పటి నుంచి ఉన్న శ్మశానంపై అధికార పార్టీ నేతల కన్నుపడిందని.. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని గ్రామస్థులు అరోపించారు. శ్మశానానికి ఆనుకుని జాతీయ రహదారి వెళ్తుండటంతో.. ఇక్కడ భూములు ధరలు భారీగా పెరిగాయి. దీంతో శ్మశాన వాటిక ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా ఈ స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కలెక్టర్లు, ఆర్డీవోలను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. విలువైన స్థలం చుట్టూ కంచె వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.