Cyclone Michaung News Updates: తీరం వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను కోస్తా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ అర్థరాత్రికి తుపానుగా మారే అవకాశం ఉంది. నెల్లూరుకు ఆగ్నేయంగా 630 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 710 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి సోమవారం మధ్యాహ్నానికి దక్షిణ కోస్తాంధ్ర -దక్షిణ తమిళనాడు తీరాలకు చేరువగా రానుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
ఈనెల 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో గరిష్ఠంగా 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ విభాగం హెచ్చరించింది. తుపాను హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వాహణ సంస్థ హెచ్చరికలు జారీచేశారు.
దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను - నెల్లూరు, మచిలీపట్నం తీరాల్లో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
CM Jagan Review on Cyclone:తుపాన్ హెచ్చరికలు నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ అధికారులు సమీక్షించారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి,కోనసీమ కాకినాడ జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అన్నిశాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎల్లుండి మధ్యాహ్నంలోపు దివిసీమ వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో 1.5 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి.