కరోనా నివారణకు సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి ఆనందయ్య వెల్లడించారు. విలేకరులకు శనివారం పంపిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో మందును అందించి, అనంతరం మిగతా ప్రాంతాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు.
మందు పంపిణీపై తయారైన వెబ్సైట్తో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డికి సంబంధం లేదన్నారు. ఈ విషయంపై సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. తెలంగాణ నుంచి యాదవ సంఘం వారు వచ్చి పరిశీలించి అభినందనలు తెలిపారని, వారిపై లాఠీఛార్జి చేసినట్లు సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. వివాదాల్లోకి లాగకుండా ప్రజల సేవలో సహకారం అందించాలని కోరారు.
మందు అమ్మకానికి పెట్టారు: సోమిరెడ్డి
ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి కుట్ర చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. మందు అమ్మకానికి వెబ్సైట్ తయారుచేసింది నెల్లూరుకు చెందిన సెశ్రిత కంపెనీ అని వెల్లడించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రి గౌతమ్రెడ్డి, కాకాణి ఫొటోలు, వైకాపా గుర్తు, రంగులతో జూన్ 2న వెబ్ పేజీ సిద్ధం చేశారు. మందుకు రూ.15 ధర నిర్ణయించి, కొరియర్ ఖర్చులు, జీఎస్టీ కలిపి రూ.167లకు విక్రయించేందుకు సిద్ధపడ్డారు. వీటిని చూసిన ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో వెబ్సైట్ను తొలగించి.. ఆ మందుతో పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి. వెబ్సైట్ వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.