Bank Employee Fraud in Nellore District: నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని కెనరా బ్యాంక్లోని ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. బంగారు నగలుపై రుణాలు తీసుకునే ఖాతాదారుల నగదును దోచేశాడు. బ్యాంకులో బంగారు నగల రుణాలు ఇచ్చే విభాగంలో పనిచేసే ఉద్యోగి భాస్కర్.. ఖాతాదారులు తెచ్చే నగలను తూకం వేసి నగదు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో బ్యాంకులో బంగారు నగలు పెట్టి రుణాలు పొందిన పలువురికి.. తక్కువ నగదు ఇచ్చి మిగిలిన డబ్బులను భాస్కర్ స్వాహా చేసేశాడని గుర్తించారు.
ఉద్యోగి భాస్కర్ వ్యవహారాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు మొత్తం 600 మందికి నోటీసులు జారి చేయగా.. ఇప్పటివరకు 130 మంది వడ్డీ కట్టి రెన్యువల్ చేసినవారి.. వడ్డీ డబ్బును బ్యాంక్లో జమ చేయకుండా కాజేసినట్లు గుర్తించారు. లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సుమారు రూ.50 లక్షల మేర కాజేసినట్లు తెలుస్తోది. దీంతో హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్న ఖాతాదారులు తమకు జరిగిన అన్యాయంపై బ్యాంకు అధికారులను నిలదీశారు. తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తేయడంతో బ్యాంకు వద్ద వారు ఆందోళనకు దిగారు. ఖాతాదారుల నగదును కొట్టేసిన ఉద్యోగి భాస్కర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఉద్యోగి గతంలోనూ ఖాతాదారులతో కుమ్మక్కై నకిలీ బంగారు నగలను బ్యాంకులో పెట్టి రుణాలు ఇచ్చినట్లుగా గుర్తించారు. ఈ అవకతవకలపై బ్యాంక్ సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
"కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన.. ఈ బ్యాంకులో మేము గోల్డ్ పెట్టుకున్నాం సర్. సంవత్సరం తరువాత వడ్డీ కట్టమని ఫోన్ చేశారు. మేము వచ్చి వడ్డీ కట్టినాము. ఆల్రెడీ లోన్ అకౌంటికి యాడ్ అయింది. కానీ వాళ్లు రెన్యువల్ చేయలేదు. కనీసం నోటీసు కూడా పంపించలేదు. ఈ రోజు వచ్చి లోన్ అమౌంట్ మొత్తం కట్టమని అంటున్నారు". - బాధితుడు