ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్‌వాడీలలో పసి మొగ్గలకు ఏది అభయం? - నెల్లూరు అంగన్ వాడీ వివరాలు

అవి పాలబుగ్గల చిన్నారులకు అక్షరాలు నేర్పే బడులు.. కానీ వాటిలోకి ఎటువైపు నుంచి ఏ విషపురుగు ఎప్పుడు వచ్చి కాటేస్తోందోనని నిత్యం ఆందోళన. ఎక్కడ పైకప్పు కూలుతుందోనని తల్లిదండ్రుల బెంగ. చుట్టూ ముళ్ల చెట్లు ఉండడంతో తరచూ పాములు, తేళ్లు వస్తున్నాయి. అద్దె భవనాల్లో నిత్యం అగచాట్లు.. విద్యుత్తు లేక పంకాలు ఉండవు. ఉక్కపోతతో నిత్యం అవస్థలే. మరుగుదొడ్లు కనిపించవు. తాగునీరూ అంతే. పక్కా భవనాలు నిర్మించినా సౌకర్యాల లేమి. వీటికి ముక్కుపచ్చలారని చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. పాలకులకు ఇవేమీ పట్టడం లేదు. కేంద్రాలకు పంపించాలని పదేపదే చెబుతున్నారు. ఇదీ నెల్లూరు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి.

anganwadi building
రేకుల ఇంట్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం (పాతచిత్రం)

By

Published : Oct 6, 2020, 2:06 PM IST

రక్షణ లేని శిథిల, అద్దె అంగన్‌వాడీ భవనాల్లో చిన్నారుల జీవితాలు మొదలవుతున్నాయి. జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 3774 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1.70 లక్షల మందికిపైగా చిన్నారులు నమోదయ్యారు. వీరికి పౌష్ఠికాహారంతో పాటు ఆటపాటలతో బోధన ఇస్తున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో ఎక్కువ మంది పేద కుటుంబాల వారే. అలాగే ఈ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందజేస్తున్నారు. నిత్యం చిన్నారులు, మహిళలు ఉండే ఈ కేంద్రాలు అభద్రతకు నిలయంగా మారాయి. ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. జిల్లాలో చాలావరకు అంగన్‌వాడీ భవనాలు ముళ్ల చెట్ల పక్కన, చెరువుల అంచున నిర్మించారు. దాదాపు 90 శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రహరీల నిర్మాణం లేదు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే తేళ్లు, పాములు కేంద్రాల్లోకి వస్తుంటాయి. చిన్నారులు విష పురుగుల కాట్లకు గురవుతున్న సందర్భాలున్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో జరిగాయి. అధికారుల ముందుచూపు లేకుండా పోవడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. సర్వేపల్లితోపాటు కోవూరు, గూడూరు, ఆత్మకూరు, తదితర నియోజకవర్గాల్లో కేంద్రాలు పొలాల్లో ఉన్నాయి. గ్రామం చివర నిర్మించడంతో పాటు ప్రహరీలు లేకపోవడంతో ప్రమాదకరంగా ఉన్నాయి.

ఇవిగో ఘటనలు

వెంకటాచలం మండలంలోని కసుమూరు పంచాయతీ వెంకటకృష్ణాపురం వడ్డిపాళెం అంగన్‌వాడీ పాఠశాలను ముళ్ల చెట్ల మధ్య ఉంది. ఏడాది క్రితం పాఠశాలలో ఉన్న విద్యార్థిని బండి వర్షిణికి తేలు కుట్టింది. రెండు రోజుల పాటు చిన్నారి ఆరోగ్యం విషమంగా మారింది. జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలందించేలా చేశారు. నాలుగు రోజులకు చిన్నారి కోలుకుంది.

●*●కోవూరు పట్టణంలోని పెళ్లకూరు కాలనీలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో ఏడాది క్రితం కట్లపాటు వచ్చింది. గుర్తించిన సహాయకురాలు ధైర్యంగా దీన్ని కొట్టి చంపింది. సహాయకురాలు గుర్తించకుంటే పిల్లలు ప్రమాదంలో పడేవారు.

●*వెంకటాచలం మండలంలోని ఒక కేంద్రంలో ఏడాది క్రితం అంగన్‌వాడీ భవనం శ్లాబు పడి ఒక చిన్నారి తలకు గాయమైంది. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.

చిన్నారుల బిక్కుబిక్కు

జిల్లాలో 200 కేంద్రాలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. పాఠశాలల్లో పిల్లలకు భద్రత లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు పిల్లలను పంపించేందుకు సంశయిస్తున్నారు. జిల్లాలో కొన్ని అంగన్‌వాడీ భవనాలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయి. నూతనంగా మంజూరైన భవనాలు కూడా పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి.

కేంద్రాల పటిష్ఠతకు చర్యలు

అంగన్‌వాడీ కేంద్రాల పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న భవనాలను ‘నాడు-నేడు’ కార్యక్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. శిథిలావస్థకు చేరుకున్న భవనాలకు మరమ్మతులు చేసేందుకు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. ఏడాదిలోపు అన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. - సుధాభారతి, పీడీ, ఐసీడీఎస్‌

ఇదీ చదవండి: శుద్దినీటి ప్లాంట్​ను పరిశీలించిన కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details