వైకాపా నాయకులు, ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే జగన్ పాలనపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు కొనియాడారు. ఎక్కడికక్కడ వైకాపా నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
కడప జిల్లాలో...
కడప కళాక్షేత్రంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విడిపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన తెలిపారు. మైదుకూరు, నల్లపురెడ్డిపల్లి, రాయచోటిలోనూ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
విశాఖ జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలు విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ భవనం వద్ద వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. విశాఖలోని వైకాపా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కర్నూలు జిల్లాలో..
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని చిల్డ్రన్ పార్క్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు విద్యార్థులు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బనగానపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
కృష్ణా జిల్లాలో..
తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు హయాంలో పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించే అదృష్టం లేకుండా చేశారనీ...ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు నేతలు తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు.