Parvathipuram Manyam district: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని నిడగల్లు గ్రామమిది. దాదాపు 5వేల మంది ఇక్కడ నివాసముంటున్నారు. వీరందరిదీ సేద్యమే ప్రధాన జీవనాధారం. వ్యవసాయ గ్రామమైన ఈ ఊరిని గత ఐదేళ్లుగా మూత్రపిండాల వ్యాధి పీడిస్తోంది. క్రమంగా విస్తరిస్తూ.. నడి వయస్కులను సైతం నడ్డి విరుస్తోంది. దీనిబారిన పడిన బాధితులు.. నరకయాతన అనుభవిస్తున్నారు. ఏ పనీ చేసుకోలేక, ఎక్కడికీ వెళ్లలేక శారీరకంగా.. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో అధికశాతం నిరుపేదలు. వీరంతా ప్రతినెలా మందులు కొనుగోలు చేయలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. మందులకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావటంతో బాధితులు ఆర్థికంగా చితికిపోతున్నారు. అసలు ఎందుకు ఈ గ్రామంలో ఈ మహమ్మారి వ్యాపిస్తుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గత ఐదేళ్ల క్రితం.. ఒక్కరిద్దరితో మొదలైన ఈ రోగం.. ప్రస్తుతం పాతికమందికి పైగా వ్యాప్తి చెందింది. బాధితుల్లో వృద్ధులతో పాటు.. నడివయస్సు కలిగిన వారు సైతం ఉండటం గమనార్హం.
ఇప్పటికే దీని బారినపడిన బాధితులు వారానికి మూడు సార్లు డయాలిసిస్ చేయించుకోవాల్సిన దయనీయ పరిస్థితి. ఉపాధికి వలస వెళ్లిన యువకులు.. తమ తల్లిదండ్రులకు చికిత్స అందించేందుకు పనులు వదులుకొని గ్రామంలోనే ఉండాల్సి వస్తోంది. వ్యవసాయాధార కుటుంబాలను కిడ్నీ రోగం అప్పులు పాలు చేస్తోంది. ఒక వైపు ఉపాధి లేక, మరో వైపు రోగం నయం చేయించుకోవడానికి డబ్బులు లేక.. అనేక రకాల అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసినా తమ వారి ప్రాణాలు నిలవకపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. గతేడాది ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వంద మందిని పరీక్షించగా 27 మందిలో కిడ్నీ సంబంధిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 6న విశాఖ కేజీహెచ్ నుంచి వైద్య రంగ నిపుణులు వచ్చి 190 మందిని పరీక్షించారు. వీరిలో ఎంత మంది కిడ్ని వ్యాధి సకిన వారు ఉన్నారో అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.