ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి 'జగన్​ అన్న' పాలన' - Parvathipuram District top news

Bjp state President Somu Veerraju Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పేర్లు మార్చి 'జగన్ అన్న' పేరుతో సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు.

Bjp state President
సోము వీర్రాజు

By

Published : Feb 3, 2023, 9:58 PM IST

Bjp state President Somu Veeraju Comments: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పేర్లు మార్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనను కొనసాగిస్తున్నారని.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం మహేందర్ జిల్లా పాలకొండలో నేడు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పేర్లు మార్చి 'జగనన్న పేరు'తో ముఖ్యమంత్రి జగన్ తన పరిపాలనను సాగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు రూ. లక్ష ఎనభై వేలు అందిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 'జగనన్న కాలనీలు'గా పేరు పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటుందని ఆగ్రహించారు.

అనంతరం రాష్ట్రం ప్రభుత్నం 'నవరత్నాల' పేరిట తొమ్మిది పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం రైతులకు 10 పథకాలను అమలు చేస్తుందని.. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలన్నారు. కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న నిధులను మళ్లించి.. రాష్ట్రం తమ ప్రయోజనాలకు వినియోగించుకుంటుందని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ వల్ల ఉత్తరాంధ్రకు మేలు కలుగుతుంది సోము వీర్రాజు పేర్కొన్నారు. కుటుంబ పాలన నడిపే రాజకీయ పార్టీలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను జగన్ దారి మళ్లించారు

ఈ రాష్ట్రంలో పార్టీని అనేక విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర చేపట్టిన అభివృద్ది పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సాగుతున్నాం. రాష్ట్రం ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను దారి మళ్లించి ప్రజలకు అన్యాయం చేస్తుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ ప్రజలకు చెందాల్సిన నిధులను సొంత పనులకు వినియోగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పేర్లు మార్చి 'జగనన్న పేరు'తో పాలన చేస్తోంది.-సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ జనాలకు దగ్గరవుతూ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న నిధులే కారణమని గుర్తు చేశారు. 8.65 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం 60 సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. 2024లో అధికారమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పెద్దబాబు, నాయకులు వేణుగోపాలం,,హేమరిక్ ప్రసాద్, జగన్నాథ్ కుమార్, స్వామితో పాటు జిల్లాలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details