ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Guru Poornami celebrations: బసవన్నల అలంకరణ.. అరకలకు పూజలు.. ఘనంగా ఏరువాక

Eruvaka Guru Poornami celebrations: రైతుల పండుగ ఏరువాక పౌర్ణమిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా వేడుకల్ని నిర్వహించగా.. అక్కడక్కడా అధికార పార్టీ నాయకులు వేడుకలు ప్రారంభించారు. తెలుగుదేశం నాయకులు రైతులతో కలిసి దుక్కులు దున్ని.. పొలాల్లో సేద్యం పనుల్ని మొదలుపెట్టారు. అన్నదాత ఆనందంగా ఉండాలని పూజలు చేశారు.

By

Published : Jun 4, 2023, 8:30 PM IST

Guru Poornami celebrations
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఏరువాక పౌర్ణమి.. ఆకట్టుకున్న వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఏరువాక పౌర్ణమి.. ఆకట్టుకున్న వేడుకలు

Eruvaka Guru Poornami celebrations: రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం పెదగాదెలవర్రులో నిర్వహించిన ఏరువాక ఉత్సవాల్లో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. స్థానిక రైతులతో కలిసి గ్రామదేవతకు పొంగళ్లు సమర్పించి పూజలు చేశారు. దుక్కులు దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు భరోసా కల్పించేందుకే ఏరువాక చేపట్టామని ఆనందబాబు చెప్పారు. వైసీపీ పాలనలో రైతులు అన్ని రకాలుగా దగా పడ్డారని విమర్శించారు. అద్దంకిలోని గోశాలలో.. బసవన్నలను అలంకరించి, అరకలకు పూజలు చేసి.. పొలాల్లో ఏరువాక నిర్వహించారు. కాకానిపాలెం, దామవారిపాలెం రైతులు.. ఆరు జతల ఎద్దులతో ఏరువాక చేపట్టారు.

పల్నాడు జిల్లా..తెలుగుదేశం నేత జీవీ ఆంజనేయులు.. రైతులతో కలిసి పల్నాడు జిల్లా ఈపూరు గ్రామ పొలాల్లో ఏరువాకను ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో 20 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినందుకు.. పార్టీ అధినేత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

గుంటూరు.. తెలుగుదేశం రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులతో కలిసి భూమాత, గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం అరక దున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించారు. పొలాల్లో ఎద్దులతో దుక్కులు దున్ని సాగు పనుల్ని ప్రారంభించారు.

అనంతపురం.. జిల్లా కనేకల్ మండలం సొల్లాపురంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని చెప్పారు. పామిడిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్​హెచ్​ లక్ష్మీనారాయణరెడ్డి.. తన నివాసం నుంచి వందల మంది టీడీపీ కార్యకర్తలు, రైతులతో కలిసి ఎద్దులతో పొలానికి ర్యాలీగా వెళ్లారు. వృషభాలకు పూజలు చేసి ఏరువాక కార్యక్రమం ప్రారంభించారు. జిల్లాలోని కుందుర్పిలో సంప్రదాయబద్ధంగా ఏరువాక నిర్వహించారు.టీడీపీ నేత ఉమామహేశ్వరనాయుడు.. కుందుర్పి శివారు పొలాల్లో దుక్కి దున్ని సేద్యం పనుల్ని ప్రారంభించారు.

శ్రీసత్యసాయి జిల్లా.. రొద్దం మండలం పెద్దగువ్వలపల్లిలో తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎద్దులతో పొలం దున్ని సాగు పనులను ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా.. మర్రిపూడి మండలంలో ఏరువాక పౌర్ణమి వేడుకల్ని.. తెలుగుదేశం ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ప్రారంభించారు. రైతుల పట్ల వ్యతిరేక భావంతో ఉన్న జగన్‌.. ఎలాంటి కార్యక్రమాల్ని చేపట్టడం లేదని విమర్శించారు.

పార్వతీపురం మన్యం జిల్లా.. కురుపాం పరిధిలోని పొలాల్లో.. ఏరువాక కార్యక్రమాన్ని.. తెలుగుదేశం ఇన్‌ఛార్ జగదేశ్వరి ప్రారంభించారు. నాగలి పట్టి దుక్కిదున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.

ABOUT THE AUTHOR

...view details