ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 5, 2022, 9:37 AM IST

ETV Bharat / state

సీమ ప్రాజెక్టులపై శీతకన్ను.. అభివృద్ధి వదిలేసి రాయలసీమ గర్జనంటూ వైకాపా రాజకీయం

Rayalaseema Irrigation Projects సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉందంటూ ఊదరగొట్టిన సీఎం జగన్‌.. సీమలో కరవు శాశ్వత నివారణకు చేపట్టిన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు వరంలాంటి ప్రాజెక్టులపై చిన్న చూపు చూస్తున్నారు. నిధులు లేకున్నా ఆర్భాటంగా 23 ప్రాజెక్టులు ఒకేసారి మొదలుపెట్టి ఆదిలోనే కాడిపడేశారు. ప్రస్తుతం సాగు నీటి కోసం రైతులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

సీమ ప్రాజెక్టులపై శీతకన్ను
సీమ ప్రాజెక్టులపై శీతకన్ను

Rayalaseema Irrigation Projects వ్యవసాయ పనుల్లేక రైతు కూలీలు వలస బాట పట్టాల్సి వస్తోంది. ప్రాజెక్టులను గాలికొదిలేసి కర్నూలులో ‘రాయలసీమ గర్జన’కు పిలుపునిచ్చి వైసీపీ రాజకీయం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయిు. ప్రాజెక్టులకు ముఖద్వారమైన కర్నూలులో కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను పక్కనపెట్టి విశాఖకు తరలించడమేంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ ఆర్​డీఎంపీ పేరుతో ఒకేసారి 23 ప్రాజెక్టులు చేపట్టింది. నిధుల్లేకుండా ఏకంగా 33 వేల 862 కోట్ల పనులకు టెండర్లు పిలిచి ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారు. ఈ పథకం కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6, కడప జిల్లాలో 10, అనంతపురంలో 2, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 5 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ కాల్వలకు లైనింగ్‌తోపాటు పలు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. మూడేళ్లలో జరిగింది సుమారు 16 వందల 50 కోట్ల విలువైన పనులే. అందులోనూ వెయ్యి కోట్లపైగా బిల్లులు బకాయిలున్నాయి. ఆర్​డీఎంపీ ప్రాజెక్టులకు నిధుల్లేక చివరకు 11 ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చే పీఎంకేఎస్​వై గ్రాంటు కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు 16 వేల568 కోట్లు అవసరమని కోరినా.. ఇంత వరకు రూపాయి రాలేదు. దీంతో ‘సీమ మిషన్‌’ అటకెక్కింది.

పోతిరెడ్డిపాడు నుంచి 80 టీఎంసీల నీటిని తీసుకునే ఉద్దేశంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పడకేసింది. ఇప్పటి వరకు 13వందల కోట్ల పనులు జరిగాయి. వీటిలో 200 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించినట్లు సమాచారం. ఎన్జీటీ, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో పథకం మూలనపడింది. కడప జిల్లాలో బ్రహ్మంసాగర్‌ ఎత్తిపోతల పథకం, కుందూ నదిపై నంద్యాల జిల్లాలో జొళదరాశి, రాజోలి జలాశయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2వేల600 కోట్లతో మూడు ప్రాజెక్టులకు 2019 డిసెంబరులో ఒకేసారి శంకుస్థాపన చేశారు. రాజోలి, జొళదరాశి పనులను 17 వందల58 కోట్లతో ఎంఆర్‌కేఆర్‌-రుత్విక్‌ జాయింట్‌ వెంచర్‌ దక్కించుకుంది. ఈ రెండు జలాశయాల నిర్మాణానికి సుమారు 8 వేల ఎకరాల భూసేకరణ చేయాలి. ప్రభుత్వం ఎకరాకు 11లక్షల 50 వేల పరిహారం నిర్ణయించగా రైతులు 30 లక్షల రూపాయల చొప్పున అడుగుతున్నారు. భూసేకరణ జాప్యంతో ఏడాదిన్నరగా ఈ రెండు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. తద్వారా కుందూ నీటితో నింపాలని చేపట్టిన బ్రహ్మంసాగర్‌ ఎత్తిపోతలకు బ్రేక్‌ పడింది.

ముఖ్యమంత్రి సొంత జిల్లా గండికోటకు నీళ్లు తీసుకెళ్లే అవుకు సొరంగం పనులకు 45 కోట్ల బిల్లులు చెల్లించక నిలబెట్టేశారు. గాలేరు-నగరి ప్రాజెక్టు ప్యాకేజీ-30 కింద రెండు సొరంగాల పనులకు శ్రీకారం చుట్టారు. ఎడమ సొరంగం తెదేపా హయాంలో పూర్తయింది. వైసీపీ వచ్చాక 108 కోట్లతో చేపట్టిన 160 మీటర్ల ఫాల్ట్‌జోన్, 2.50 కిలోమీటర్ల లైనింగ్‌ పనులు జాప్యమవుతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఏడాది తర్వాత ప్రభుత్వం 787 కోట్లకు పాలనామోదం తెలిపింది.

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరవు నివారణకు రాజోలిబండ మళ్లింపు పథకం-ఆర్​డీఎస్​ వేదవతి ప్రాజెక్టులకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని 45 వేల ఎకరాలకు సాగు లక్ష్యంగా 1985.42 కోట్లతో పనులు ప్రారంభించారు. టీడీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వేదవతి ప్రాజెక్టు ప్రారంభించాలని గూళ్యంలో ఒకరోజు జలదీక్ష చేపట్టారు. ఆదోని, ఆలూరు పరిధిలో 80 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా చేపట్టిన వేదవతి ప్రాజెక్టు ప్రస్తుతం భూసేకరణలో జాప్యం, గుత్తేదారుకు సుమారు 100 కోట్ల వరకు బిల్లుల బకాయిలతో నిలిచిపోయింది. నాడు జలదీక్ష చేసిన జయరాం నేడు మంత్రిగా ఉన్నా ప్రాజెక్టుకు నిధులు సాధించి ముందుకు నడిపించలేకపోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. కేసీ కెనాల్‌ సింప్‌ పథకం కింద 513 కోట్ల రూపాయలతో ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం వాటాగా చెల్లించాలి. ఇందుకు ప్రభుత్వం సమ్మతి పత్రం ఇంత వరకు ఇవ్వలేదు. ఫిబ్రవరిలోగా స్పందించపోతే ప్రాజెక్టు వెనక్కిపోయినట్లే.

హంద్రీనీవా నీటితో 68 చెరువులు నింపేందుకు 224 కోట్ల రూపాయలతో టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే 52 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ మూడున్నరేళ్లలో ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాకాలో వైసీపీ ప్రభుత్వం కేవలం 24 శాతం పనులే చేసింది. హంద్రీనీవా పరిధిలో కాలువ వ్యవస్థ ఏర్పాటు, పందికోన జలాశయం సమస్యలు పరిష్కరించేందుకు 150 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని జిల్లా మంత్రులు ఆర్భాటంగా ప్రకటించినా ఆ దస్త్రానికీ అతీగతీ లేదు. కాలువలు అందుబాటులోకి రాకపోవడంతో 60 వేల ఎకరాలకు నీరందడం ప్రశ్నార్థకమైంది. గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి 5 వేల 400 కోట్ల రూపాయలతో డీపీఆర్‌ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. కానీ ఇంత వరకు ఆమోదం తెలపలేదు. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో కేసీ కెనాల్‌ కింద 2.65 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లివ్వడంతోపాటు అదనంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే వరంలాంటి ప్రాజెక్టును పక్కన పెట్టేశారు.

జీడిపల్లి- పేరూరుకు 2020 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. మూడు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించిన ఈ ప్రాజెక్టు శిలాఫలకాలకే పరిమితమైంది. టీడీపీ హయాంలో హెచ్చెల్సీ 60 శాతం పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 300 కోట్లతో కొత్త ప్రతిపాదనలు పెట్టి చేతులెత్తేశారు. 2021లో రాయదుర్గం పర్యటనలో ఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి సీఎం ఇచ్చిన హామీ అమలయ్యేలా అడుగులు పడలేదు. హంద్రీనీవా 33, 34, 36 ప్యాకేజీలు చివరిదశలో ఉన్నప్పటికీ నిధుల్లేక నిలిచిపోయాయి. మడకశిర బ్రాంచి కెనాల్‌ టీడీపీ హయాంలో 80 శాతం పూర్తవగా.. వైసీపీ వచ్చాక బైపాస్‌ కెనాల్‌కు 240 కోట్లరూపాయలతో ప్రతిపాదనలు చేసి అటకెక్కించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details