YSRCP government on Weavers : విపక్షంలో ఉండి పాదయాత్ర చేసిన సమయంలో చేనేతలకు తాను దోస్తీ అన్నాడు. అధికారంలోకి రాాగానే వారి సమస్యలన్నీ తీరుస్తానని మాటిచ్చాడు. తీరా అధికారం చేపట్టి ముఖ్యమంత్రైనా తర్వాత మాత్రం.. కేవలం నేతన్న నేస్తంతో చేతులు దులుపుకున్నాడు. అది కూడా సొంత మగ్గాలు ఉన్నవారికేనంటూ షరతులు విధిస్తూ.. దీంతో సొసైటీలలో పనిచేసే కార్మికులకు చుక్కెదురైంది. ప్రభుత్వం నుంచి రాయితీలు రాక.. చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు లేక నేతన్నల బతుకులు తెగిపోయిన దారం పోగులా తయారయ్యాయి.
రాష్ట్రంలో చేనేత రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. గతంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేశాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ రంగాన్ని పట్టించుకోవటమే లేదని నేతన్నలు ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది కార్మికులు ఈ రంగంలో పని చేస్తుండగా కేవలం.. 80వేల 546 మందికి మాత్రమే నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేస్తున్నారని వాపోతున్నారు. సొంత మగ్గం ఉన్నవారే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం నిబంధనలు విధించటంతో నేత కార్మికులు నష్టపోతున్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు సొసైటీలు, మగ్గాలు ఉన్న యజమానుల వద్దే పని చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్నా అనేకమంది కార్మికులకు సొంత మగ్గాలు లేవు. కొందరు అద్దెకు మగ్గాలు సమకూర్చుకుని నేస్తుంటారు. అలాంటి వారికీ నేతన్న నేస్తం వర్తించడం లేదు. కొన్నిచోట్ల అయితే ప్రతిపక్షాలకు సంఘీభావం తెలుపుతున్న వారిని ఈ పథకం నుంచి తప్పించారు. పల్నాడు జిల్లా గారపాడులోని కొందరు ఈ విధంగా పథకానికి దూరం కావటంతో.. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వృత్తి ఆధారంగా అందించాల్సిన పథకాన్ని సాకులతో తిరస్కరిస్తుండటంతో నేతన్నలు ఆవేదన చెందుతున్నారు.
"ఇళ్లు వాకిల్లు వదిలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి జీవనం సాగిస్తున్నారు. సొంత మగ్గాలు ఉన్నవారికే నేతన్న నేస్తం అని షరతులు విధించారు. ఇది బాగానే ఉన్నా.. సొంత మగ్గాలు లేని వారికి అందించే పథకాలైనా అందివ్వాలిగా"- నేత కార్మికుడు