ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP High Court: హైకోర్టుకు హాజరైన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్.. ఆ కేసుపై విచారణ మూసివేత​

By

Published : May 11, 2023, 8:31 AM IST

High Court on Vijayawada Municipal Commissioner: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్​పై కోర్టు ధిక్కరణ కేసు విచారణను హైకోర్టు మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ప్రశాంత్​కుమార్​ మిశ్రా, జస్టిస్​ డీవీఎస్​ఎస్​ సోమయాజులు తీర్పు వెలువరించారు.

High Court on Vijayawada Municipal Commissioner
High Court on Vijayawada Municipal Commissioner

High Court on Vijayawada Municipal Commissioner: కోర్టు ధిక్కరణ కేసులో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ హైకోర్టుకు హాజరయ్యారు. ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్​కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ జరిపింది. కమిషనర్ స్వప్నిల్​ దినకర్​ తరపు న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడటం లేదన్నారు. కోర్టు ఆదేశించిన నిర్దిష్ట గడువు లోపే తగిన ఉత్తర్వులు జారీ చేశారని కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కమిషనర్ పై విధించిన కోర్టు ధిక్కరణ కేసు విచారణను మూసివేసింది.

పాములపాటి నాగరత్నమ్మ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, అధికారులకు వినతి సమర్పించినా చర్యలు లేవని పేర్కొంటూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్జీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్ సత్యనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. అక్రమ నిర్మాణం విషయంలో పిటిషనర్ ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని విజయవాడ కమిషనర్​ను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు కమిషనర్ వ్యవహరించలేదని పిటిషనర్ సత్యనారాయణ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. గతంలో విచారణ జరిపిన ధర్మాసనం.. స్వయంగా హాజరు కావాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్​ను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. నిర్దిష్ట సమయంలోనే తగిన ఉత్తర్వులు ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ధిక్కరణపై విచారణను మూసి వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ సత్యనారాయణ తరఫున న్యాయవాది ఎం.గిరిబాబు వాదనలు వినిపించారు. కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ జడ్జి రద్దు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అది ప్రత్యేక వ్యవహారం అని తెలిపిన ధర్మాసనం.. తమ ఆదేశాల మేరకు తగిన సమయంలో కమిషనర్ తగిన ఉత్తర్వులు జారీ చేసినందున కోర్టు ధిక్కరణపై విచారణను మూసివేస్తున్నట్టు స్పష్టం చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన న్యాయశాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం:హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్​కుమార్ మిశ్రాను ఏపీ న్యాయశాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామరాజు చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి ఆర్. నవీన్ కుమార్, తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. దిగువ కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేసినందుకు సీజేకు కృతజ్ఞతలు తెలిపారు. బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రావు వారితో పాటు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details