ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 16, 2023, 8:07 AM IST

Updated : May 16, 2023, 9:04 AM IST

ETV Bharat / state

Tax Increased On Vehicles: రవాణా వాహనాలపై బాదుడే బాదుడు..30 శాతం పన్నుపెంచిన ప్రభుత్వం

30 Percent Of Tax Increased On Vehicles In AP: రవాణా వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను బాదుడు మోపింది. త్రైమాసిక పన్నును ఏకంగా 30 శాతం పెంచింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. పన్ను పోటుతో లారీలు, బస్సులు, ట్యాక్సీలపై 250 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రవాణా రంగం కుదేలవుతుందని ఆ రంగం ప్రతినిధులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

30 Percent Of Tax Increased On Vehicles In AP
రవాణా వాహనాలపై 30 శాతం పన్నును పెంచిన ప్రభుత్వం

రవాణా వాహనాలపై బాడుడే బాదుడు

30 Percent Of Tax Increased On Vehicles In AP : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన వద్దే డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉండటంతో గగ్గోలు పెడుతున్న సరుకు, ప్రయాణికుల రవాణా వాహనదారులకు ప్రభుత్వం పన్ను పెంపు రూపంలో మరో షాక్‌ ఇచ్చింది. త్రైమాసిక పన్ను 25 నుంచి 30 శాతం వరకు పెంచుతూ సోమవారం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనివల్ల రవాణా వాహనదారులపై ఏటా 250 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. త్రైమాసిక పన్ను పెంపునకు సంబంధించి జనవరి 11న ప్రాథమిక నోఫికేషన్‌ ఇచ్చిన ప్రభుత్వం, సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరింది.

ఇప్పటికే పొరుగు రాష్ట్రాల వాహనాలతో పోటీ పడలేకపోతున్నామని, త్రైమాసిక పన్ను పెంచి మరింత భారం వేయొద్దంటూ లారీల యజమానుల సంఘాలు, ఇతర సంఘాలు.. మంత్రులు, ఉన్నతాధికారులకు పదే పదే మొరపెట్టుకున్నారు. ఐనా సరే ప్రభుత్వం ఏమాత్రం కరుణించలేదు. జనవరిలో ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌లో ఎటువంటి మార్పులు లేకుండా తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో రవాణా వాహనదారుల నడ్డివిరిచినట్లు అయింది. రవాణా శాఖకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4,294 కోట్లు రాబడి రాగా, అందులో రవాణా వాహనాల నుంచి త్రైమాసిక పన్ను రూపంలో 973 కోట్లు వచ్చింది. తాజా పెంపుతో ఈ శాఖ రాబడి మరో 250 కోట్లకు పైగా పెరగనుంది.

ప్రతి త్రైమాసికానికి ఆరు టైర్ల లారీలపై 850, పది టైర్ల లారీపై 1,810, పన్నెండు టైర్ల లారీపై 2,390, పద్నాలుగు టైర్ల లారీపై 2,950, పదహారు టైర్ల లారీపై 3,610 రూపాయల చొప్పున భారం వేశారు. 12 నుంచి 15 టన్నుల సామర్థ్యముండే లారీలకు 2,967.30 రూపాయల త్రైమాసిక పన్ను ఉండేది. అంతకంటే అదనంగా ఉంటే ప్రతి 250 కేజీలకు 69.30 రూపాయల చొప్పున పన్ను వసూలు చేసేవారు. తాజా పెంపుతో 12 నుంచి 15 టన్నుల వరకు పన్ను 3,710 రూపాయలకి చేరింది. అటుపై ప్రతి 250 కేజీలకు 90 రూపాయల చొప్పున పెంచారు.

లైట్‌ మోటారు వాహనాల్లో నలుగురికి నుంచి ఆరుగురు ప్రయాణికుల సామర్థ్యం ఉండే వాటికి ఇప్పటి వరకు త్రైమాసిక పన్ను 326.55 రూపాయలు ఉండగా, 410కి పెంచారు. ఏడుగురు కంటే ఎక్కువ మంది ప్రయాణికుల సామర్థ్యం ఉండే, ఆల్‌ ఇండియా టూరిస్ట్‌ వాహనాలకు ప్రస్తుతం 652.05 రూపాయలు ఉండగా దానిని 820 చేశారు. మూడు చక్రాల వాహనాలకు మాత్రం త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. మరో వైపు త్రైమాసిక పన్ను పెంపు వల్ల సరుకు రవాణా వాహనదారులకు అదనంగా హరిత పన్ను రూపంలో కూడా భారం పెరగనుంది. హరిత పన్నను 2021లోనే భారీగా పెంచగా ఇప్పుడు త్రైమాసిక పన్ను పెరిగిన నేపథ్యంలో మరింత భారం కానుంది.
పెంచిన త్రైమాసిక పన్నును ఉపసంహరించుకోకపోతే రవాణా రంగం ఇక నిలదొక్కులేదని, తాము రోడ్డున పడటమేనని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు.

ట్రావెల్స్‌ బస్సులపై కూడా త్రైమాసిక పన్ను భారం పడింది. ట్రావెల్స్‌ బస్సులపై సీటు లేదా బెర్తుకు ప్రస్తుతం 3,675 రూపాయలు ఉండగా, 325 చొప్పున పెంచి 4 వేలు చేశారు. సగటున ఒక్కో బస్సులో 35 సీట్లు ఉన్నాయనుకుంటే ఓ ట్రావెల్స్‌ బస్సుపై ఇప్పటి వరకు త్రైమాసిక పన్ను 1.28 లక్షలు ఉండగా, తాజాగా అది 1.40 లక్షలకు చేరినట్లు అయింది. పన్ను పెంపు మేరకు ఛార్జీలు పెంచే పరిస్థితి ప్రస్తుతం లేదని, ప్రభుత్వ నిర్ణయంతో నష్టాలే మిగులుతాయని పలు ట్రావెల్స్‌ సంస్థల యజమానులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి

Last Updated : May 16, 2023, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details