ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 13, 2023, 7:13 PM IST

Updated : Jan 13, 2023, 10:42 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో మొదలైన సంక్రాంతి శోభ.. అంబరాన్నంటుతున్న సంబరాలు

Sankranti Celebrations: రాష్ట్రవ్యాప్తంగా ఊరు-వాడా.. పల్లె-పట్నం అనే తారతమ్యం లేకుండా సంక్రాంతి శోభ సంతరించుకుంది. అన్ని నగరాల్లోని ప్రధాన కూడళ్లు జనసంద్రంగా మారాయి. వస్త్ర, వస్తు, నిత్యవసర దుకాణాలన్నీ జనంతో కిక్కిరిశాయి. గాలిపటాలు ఎగరవేయటం, ముగ్గుల పోటీలు, భోగి మంటలు, గంగిరెద్దు ప్రదర్శన, నృత్యాలతో.. రాష్ట్రం మెుత్తం పండగ సందడి నెలకొంది.

Sankranti celebrations
సంక్రాంతి సంబరాలు

రాష్ట్రంలో సంక్రాంతి శోభ

Sankranti Celebrations: రాష్ట్రంలోని వ్యాపార కూడళ్లు జనాలతో కిక్కిరిపోయాయి. కళాశాలల్లో విద్యార్థినిలు సంప్రదాయ వస్త్రాలు ధరించి పండగని జరుపుకున్నారు. డూడూ బసవన్న ఆటలు.. యువత పాటలతో కోలాహలం సంతరించుకుంది. నిత్యం పనితో కుస్తీ పట్టే ఉద్యోగులు.. సంబరాలు చేసుకుని తమ ఉత్సాహాన్ని కనబరిచారు.

భోగి మంటలు..ముగ్గుల పోటీలతో: విజయనగరంలోని శిల్పారామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు, గంగిరెద్దు ఆటలు, ముగ్గుల పోటీలు, కోలాటం, సంప్రదాయ వంటకాల ప్రదర్శన.. నగరవాసులను అలరించాయి. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పలువురు నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

"తెలుగు వారంతా.. ఎంతో సంతోషంగా, ఘనంగా జరుపుకునే పండగలలో ముఖ్యమైనది సంక్రాంతి. సంక్రాంతి పండగను పురష్కరించుకొని.. వివిధ ప్రాంతాలలో.. వివిధ రకాలుగా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు". - కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ స్పీకర్

నెల్లూరులో కోలాహలం:నెల్లూరు జిల్లాలో.. సంక్రాంతి సందడి నెలకొంది. కరోనా తరువాత పెద్ద ఎత్తున సంక్రాంతిని ప్రజలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు , కావలి, కందుకూరు పట్టణాల్లో వ్యాపార కూడళ్లలో కోలాహలం కనిపిస్తోంది. నెల్లూరు నగరంలోని సండే మార్కెట్, స్టౌన్ హౌస్ పేట, చిన్నబజారు, పెద్ద బజారుల్లో హోల్ సేల్ వస్త్ర దుకాణాలు, నిత్యవసర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

విశాఖలో ఉద్యోగులు:సంక్రాంతి సంబరాలు వివిధ ప్రదేశాల్లో పండగ వాతావరణం మరింతగా ప్రతిఫలించేట్టుగా చేస్తున్నాయి. విశాఖలోని వివిధ సంస్థలు తమ ఉద్యోగులను.. సిబ్బందిని ఇందులో భాగస్వాములు చేస్తున్నాయి. యువత ఈ సంబరాల్లో తమ ఉత్సాహాన్ని.. ఆనందాన్ని కనబరుస్తున్నారు. దీంతో సంక్రాంతి ముందస్తు వాతావరణం నెలకొంది.

కోమసీమ విద్యార్థినిలు: కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని తార జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. విద్యార్థినిలు సంప్రదాయ వస్త్రాలు ధరించి.. వైభవంగా పండగని జరుపుకున్నారు. అన్నం పెట్టే రైతన్న, గోమాత, వివిధ రకాల ముగ్గుల్ని మహిళలు వేశారు.భోగి మంటలు వేసి కోలాటమాడుతూ నృత్యాలు చేశారు. డూడూ బసవన్న యజమాని చెప్పే మాటలకు లయబద్దంగా కదులుతూ విన్యాసాలతో ఆకట్టుకుంది.

బాపట్లలో పోటీలు: బాపట్ల జిల్లా రేపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణ శివారులో పోటేళ్ల పోటీలు ఏర్పాటుచేశారు. పోటీలను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు ప్రారంభించారు. పందేలలో పాల్గొనేందుకు ఆంధ్ర, తెలంగాణ , బెంగళూరు,మహారాష్ట్ర నుంచి పోటీదారులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా సాంప్రదాయ కార్యక్రమాలు ,పోటీలు నిర్వహిచడం హర్షణీయమని ఎంపీ మోపిదేవి అన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కలెక్టర్ కె.విజయ్‌కృష్ణన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"పొంగల్ అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు మా ఊర్లో ఉన్నట్టే ఉంది. చాలా సంతోషంగా ఉంది. చుట్టాలతో ఉన్నట్టు అనిపిస్తుంది". - కె.విజయ్‌కృష్ణన్, బాపట్ల జిల్లా కలెక్టర్

గంగిరెద్దు ఆటలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గులు వేసి.. తెలుగు సంప్రదాయాల ప్రకారం గంగిరెద్దు ఆటలతో సందడిగా గడిపారు.

గుంటూరులోసంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలు కిట్టీ పార్టీ నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్యామలానగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు.. ఒకే తరహా పట్టుచీరలు ధరించి సందడి చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 13, 2023, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details