Purandeshwari Fire on YSRCP Govt: ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా.. రైతుల గోడు పట్టించుకునే పరిస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేదని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన.. ఏ ఒక్క హామీనీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
BJP Kisan Morcha Program Updates: విజయవాడలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా చిగురుపాటి కుమారస్వామి, ఇతర సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం, కాలువల నిర్వహణను గాలికొదిలేశారని పురందేశ్వరి మండిపడ్డారు. అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నా.. సాగుదారులకు మేలు కలిగించే రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని ఆమె దుయ్యబట్టారు.
Purandeshwari Comments: ''కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలకు స్టిక్కర్లు వేసుకుని, ప్రయోజనం పొందాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల్లో పంటలు పండించలేని దుస్థితి నెలకొంది. వైసీపీ పాలనలో రైతుల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. రాష్ట్రంలోని సాగునీటి సమస్యలను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు. సాగునీరు లేక, వర్షాలు కురవక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. అసలు.. ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించారు..? అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏం చేసింది..? ఈ రాష్ట్రంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరో ప్రజలకు తెలుసా..?'' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.