ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2023, 6:48 PM IST

ETV Bharat / state

న్యాయబద్దమైన డిమాండ్​తో నిరసనలు చేస్తే.. కేసులా! సీఎం బుద్ధి చెబుతాం: మందకృష్ణ

MRPS Leaders Statewide Protests: రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపట్టారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయకపోతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

MRPS Leaders Protests
ఎమ్మార్పీఎస్ నాయకుల నిరసన

MRPS Leaders Statewide Protests: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో మందకృష్ణ మాదిగ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వర్గీకరణ జరగలేదనే ఉద్దేశంతో శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేపట్టిన వేలాది మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టడం సరికాదని మందకృష్ణ మాదిగ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిగలను చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు.

ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ ఆందోళన: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆందోళన చేపట్టింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఎమ్మార్పీఎస్ నాయకులు, అధికారులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

వచ్చే ఎన్నికల నాటికి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మంద కృష్ణ మాదిగ సంతకం చేసిన వినతిపత్రాన్ని కలెక్టర్​కు అందివ్వాలంటూ వారు కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ఎమ్మార్పీఎస్ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

కడప జిల్లాలో ఉద్రిక్తత: ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ శివయ్య మాదిగ ఆరోపించారు. వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. డప్పులు వాయిస్తూ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్​లోని వెళ్లి అధికారులకు వినతిపత్రం ఇస్తామని అనడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులందరూ కలెక్టరేట్​లోకి దూసుకెళ్లగా.. పోలీసులు వారిని అడ్డగించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ వర్గీకరణ విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

తీరని అన్యాయం చేశారు: ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం.. అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి.. ఎస్సీలకు తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని వారు హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ పోరాటంలో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details