TENSION AT GOLLAPUDI TDP OFFICE : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజాము నుంచే పోలీసులు, అధికారులు మోహరించి స్థానిక టీడీపీ కార్యాలయాన్ని తొలగించారు. పార్టీ ఫ్లెక్సీలు, ఫర్నిచర్, కంప్యూటర్లను తరలించారు. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు. బయట రోడ్డుకు ఆనుకుని కూర్చునే పసుపు రంగు బల్లలు సైతం అధికారులు తొలగించారు.
పార్టీ కార్యాలయం వైపు ఎవరూ రాకుండా ముందస్తుగా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో బారికేడ్లు పెట్టి ఎవర్నీ అనుమతించలేదు. విషయం తెలుసుకున్న పలువురు పార్టీ కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. టీడీపీ కార్యాలయం తొలగింపు నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఆయన బయటకు రాకుండా చేశారు.
గొల్లపూడిలో టీడీపీ కార్యాలయ స్థలం లీజుపై గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. లీజుదారుడు ఆలూరి చిన్నా, ఆయన కుటుంబసభ్యుల మధ్య వివాదం తలెత్తడంతో హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థల వివాదం పరిష్కరించుకోవాలని ఆలూరి చిన్నా కుటుంబ సభ్యులకు గత నెల 28న తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించుకునేలోపే పార్టీ కార్యాలయాన్ని అక్కడి నుంచి అధికారులు, పోలీసులు తొలగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి కళ్లల్లో ఆనందం చూడటానికే పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ స్థలంలోనే పార్టీ కార్యాలయం కొనసాగుతోందని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే కార్యాలయం తొలగించారని ఆరోపించారు. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటలు గడవక ముందే కార్యాలయం తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరగకూడదనే దురుద్దేశంతోనే ఇదంతా చేశారని విమర్శించారు.