Medical Students on Selling MBBS Seats in Categories: వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాం.. నూతనంగా వైద్య సీట్లు పెరుగుతున్నాయి.. పేద విద్యార్థులకు అండగా ఉంటామని ఊదరగొట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఇప్పుడు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా చేసి విక్రయించటాన్ని వైద్య విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిన ఈ జీవోను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మెకు దిగుతామని వైద్య విద్యార్థులు హెచ్చరించారు.
నూతన వైద్య కళాశాలలు రాబోతున్నాయి.. ఆశలు నెరవేరుతాయనుకున్న తమకు కన్నీళ్లే మిగులుతున్నాయని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సర్కారు.. పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోందని వాపోయారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాం.. నూతనంగా వైద్య సీట్లు పెరుగుతున్నాయి..పేద విద్యార్థులకు అండగా ఉంటామని ఊదరగొట్టే పబ్లిసిటీ ఇచ్చిన వైసీపీ సర్కారు.. సీట్లను కేటగిరీలుగా విభజించి ప్రైవేట్ కాలేజీ తరహాలో అమ్ముకునేందుకు సిద్ధమవటం దారుణమని వైద్య విద్యార్థుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యులైన విద్యార్థులు సేవాదృక్పథంతో పనిచేయలేరని ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం అంటోంది. దీంతోపాటు పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు బాగా తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని ఏపీ జూడా సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.