Karthika Masam Second Monday : పవిత్ర కృష్ణానదీ తీరం అంతటా కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక సోమవారం, పౌర్ణమి కలిసి వచ్చిన వేళ.. పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి తరలివచ్చారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచే నది చెంతన జల్లు స్నానాలు ఆచరించి.. దీపాలు వదిలి తమ భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు. రేపు చంద్రగ్రహణం ఉండడంతో ఇవాళ చాలా మంది కార్తిక పౌర్ణమి రోజు నిర్వహించే పూజలు, గౌరీ నోములు నోచుకుంటున్నారు.
కార్తిక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కోటిదీపోత్సవం నిర్వహించేందుకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జ్వాలాతోరణం నిర్వహించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.
శివునికి ఎంతో పీతిపాత్రమైన కార్తికమాసం సందర్భంగా.. శ్రీశైల ఆలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పౌర్ణమి సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సా.6.30 గంటలకు ఆలయం ముందు భాగంలో జ్వాలా తోరణోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7:30 నుంచి ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవాన్ని ఘనంగా చేపట్టనున్నారు.
కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ, అభిషేకాలు నిర్వహించారు. పుణ్య స్నానాలు ఆచరించిన మహిళలు కార్తికదీపాలు వెలిగిస్తూ తమ మొక్కులను చెల్లించుకున్నారు. పవిత్ర కార్తికమాస ఉత్సవాల్లో వేలాదిగా పాల్గొంటున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దేవదాయ శాఖ అధికారులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా కార్తిక మాసం రెండవ సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ఠ గోదావరిలో కార్తిక పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి నరసాపురం తో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. గోదావరి మాతకు పూజలు చేసి కార్తిక దీపాలు నది లో విడిచి పెట్టారు. భక్తుల శివనామస్మరణతో శివాలయాలు మార్మోగుతూ.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పలు ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
నరసాపురంలోని కపిల మల్లేశ్వర, అమరేశ్వర , విశ్వేశ్వర , ఏకాంబరేశ్వర స్వామి, లక్ష్మమనేశ్వరం ప్రసిద్ధ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పురాతన ఆలయంలో స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు చేశారు. దేవాలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. రావణ వధ అనంతరం పాప పరిహారార్థం లక్ష్మణుడు ఈ ప్రాంతంలో శివలింగం ప్రతిష్టించినట్లు పురాణ గాథ చెబుతుంది. కార్తిక మాసం పర్వదినాలలో స్వామివారిని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజు నదీ స్నానాలు ఆచరించి కార్తిక దీపాలు నదిలో వదిలితే పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాసం 2వ సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈరోజు పౌర్ణమి రాత్రిగా రావడం వల్ల 33 పున్నమి నోములు నోచుకునే వారు, ఉపవాసం ఉండేవారు 365 వత్తుల దీపారాధన చేసేవారు ఈ సోమవారం చేసుకోవాలని ఆలయ అర్చకులు తెలిపారు.