Lorry Owners Protest Against Increase In Toll Tax : ఏప్రిల్ 1 నుంచి టోల్ టాక్స్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తేలికపాటి వాహనాలపై ట్రిప్పుకు 5 శాతం, భారీ వాహనాలపై ట్రిప్పుకు 10 శాతం మేర టోల్ చార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని లారీ ఓనర్లు మండిపడుతున్నారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోషియేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.
తీవ్ర సంక్షోభంలో రవాణా రంగం : ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి పన్నుల పోటు విధించారని, ఇది చాలదన్నట్లు టోల్ టాక్స్లు పెంచడం దుర్మార్గమని అసోషియేషన్ నేతలు, లారీ యజమానులు అంటున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడీ మరీ డీజిల్, ఆయిల్ ధరలు విపరీతంగా పెంచుతుండటం, పన్నుల పెంపు వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని టోల్ టాక్స్ పెంపు వల్ల లారీ యజమానుల నడ్డి విరుగుతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో టోల్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లారీ యజమానులు డిమాండ్ చేశారు.
బాదుడే బాదుడు : గతంలో 4 లేదా 5 ఏళ్లకోసారి టోల్ టాక్స్ లను స్వల్పంగా పెంచేవారు. ఇటీవల దీన్ని పక్కన పెట్టి ఏటా బాదుతున్నారని లారీ యజమానులు అంటున్నారు. ఏటా టోల్ టాక్స్ పెంచుతూ ప్రభుత్వం విపరీతంగా దోపిడీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2022 లో టాక్స్ 10-15 శాతం పెరింగిందని ఇంతలోనే ఇప్పుడు మరోసారి బాదడం దుర్మార్గమని అంటున్నారు. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర సరుకుల ధరలు మండి పోతున్నాయి.