Houses Incomplete in YSR Jagananna Colonies :ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నా.. ఆచరణలో మాత్రం రాష్ట్రంలో ఎక్కడ కన్పించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం (YSRCP Government) ఇచ్చే నిధులు ఏ మూలకూ చాలకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. ఆర్థిక చేయూత అందిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణ రూపం దాల్చకపోవడంతో పనులు మందగించాయి. ఎన్టీఆర్ జిల్లా మెలవరం నియోజకవర్గంలో చాలామంది లబ్ధిదారులు గృహ నిర్మాణ పనులు పునాధులకే పరిమితం చేశారు.
YSRCP Government Careless on Jagananna Colonies :జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలోని మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ గ్రామీణ మండల గ్రామాల పరిధిలో తొలి విడతగా జగనన్న కాలనీల పేరిట పక్కా గృహాలను మంజూరు చేశారు. రెండో దశలో రెడ్డి గూడెం మండలంలో అనుమతులు ఇచ్చారు. సుమారు 20వేల మందికి పట్టాలివ్వగా.. సొంత స్థలమున్న 3వేల మంది వరకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఒత్తిడితో ఎలాగోలా ప్రారంభించి.. తర్వాత మధ్యలోనే వదిలేశారు.
Jagananna Colonies Beneficiaries Facing Problems In NTR District :మెలవరం నియోజకవర్గంలో 16వేల 920 ఇళ్లకు అనుమతులు ఇవ్వగా... పునాదుల దశలో 8వేల 811 ఇళ్లున్నాయి. పూర్తైనవి 4వేల 24 ఇళ్లు కాగా.. వివిధ దశల్లో మరో 4వేల 658 ఇళ్లున్నాయి. సొంత నిధులు వెచ్చించుకోలేని వారికోసంగుత్తేదారులను ఏర్పాటు చేస్తే పురోగతి ఉంటుందని భావించిన అధికారులు.. ఊరగుట్ట, జి.కొండూరు మండలంలోని ఓ గ్రామంలో లబ్ధిదారుల నుంచి కొంత మొత్తం తీసుకున్నారు. 30వేల వరకు తీసుకున్నా ఆయా ప్రాంతాల్లో పనులు పునాదులు దాటలేదని, నిర్మాణాలు మధ్యలోనే ఆగాయని డబ్బులు చెల్లించిన వారు మొత్తుకుంటున్నారు. వూరగుట్ట, చంద్రాల, కొండపల్లి మున్సిపాల్టీలో ఏడాది కిందట నుంచే నిర్మాణాలు మందగించాయి.