Contractual Lecturers Protest for Regularization: కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ కాంట్రాక్టు లెక్చరర్లు శనివారం రోడ్డెక్కారు. 2014 జూన్ 2 వరకు ఐదు సంవత్సరాల సర్వీసు ఉండాలనే నిబంధనను తొలగించాలని డిమాండు చేస్తూ.. ‘జగనన్నకు చెబుదాం- కాంట్రాక్టు లెక్చరర్ల గోడు’ పేరుతో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. కాంట్రాక్టు లెక్చరర్లు ర్యాలీ నిర్వహించటానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో సదస్సు కొనసాగించారు. మా నమ్మకం నువ్వే జగన్.. నువ్వే మా దైవం అన్నా అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను చేత పట్టి పదర్శన చేపట్టారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. జూన్ 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అప్పటికి కూడా పరిష్కారం దొరకకపోతే 25వ తేదీన మరో ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. సుప్రీం కోర్టు ఎక్కడ కూడా సర్వీసు నిబంధన పెట్టలేదని గర్తు చేశారు, అటువంటి నిబంధనలే ఉంటే తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను ఎలా క్రమబద్ధీకరించారని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నాయకుడు సురేష్ ప్రశ్నించారు.
ఉద్యమ కార్యాచరణ వివరాలు..
- 11వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి, సమస్య విన్నవించడం.
- 19 నుంచి 20 వరకు సామాజిక మాధ్యమ వేదికగా సోషల్ మీడియాల్లో సమస్యను విన్నవించడం. మహిళలతో విజయవాడలో కార్యక్రమం
- 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉపసంఘంలోని మంత్రులను కలవడంతో పాటు ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు ప్రయత్నించడం
- సమస్య పరిష్కారం కాకపోతే 25న ఉద్యమ కార్యాచరణ నిర్ణయం
అందర్నీ క్రమబద్ధీకరించాల్సిందే: కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. విభజన సమయానికి ఉన్న అందరికీ వర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అందరికీ న్యాయం చేయాలని.. కొందరు ఫోన్లు చేసి ఏడ్చేస్తున్నారని తెలిపారు. అయిదేళ్ల సర్వీసు నిబంధన అన్యాయంమని, గతంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆందోళనల వల్లే వారికి వేతనాలు పెంచారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ను కలిసి సమస్యను విన్నవిస్తానన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులంతా స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వివరించాలని సూచించారు. వారి సమస్య పరిష్కారం అయ్యేవరకూ కృషి చేస్తామని వెల్లడించారు.