Chandrababu Condolences to Actors Family: తెలుగు చిత్రసీమ ఇద్దరు దిగ్గజ నటులను కోల్పోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ నగర్లోని కైకాల సత్యనారాయణ, తమ్మారెడ్డి చలపతిరావుల నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కైకాల సత్యనారాయణ, చలపతిరావులతో వ్యక్తిగతంగానూ, తెలుగుదేశం పార్టీతోనూ ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన హయాంలో కైకాల పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారని, చలపతిరావు తమ ఇంట్లో మనిషిగా ఎదిగారని వాపోయారు. వారిద్దరి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్న చంద్రబాబునాయుడు.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. చంద్రబాబు వెంట తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని, టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్, కంభపాటి రాంమోహన్ రావులు హాజరై కైకాల సత్యనారాయణ, చలపతిరావులకు నివాళులర్పించారు. రేపు ఉదయం 9 గంటలకు మహాప్రస్థానంలో తన తండ్రి చలపతిరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రవిబాబు తెలిపారు.
"కైకాల సత్యనారాయణ గారి మరణం బాధాకరం. తెలుగు ఇండస్ట్రీ గొప్ప నాయకుడ్ని కోల్పోయింది. సుమారు 770 సినిమాలు నటించారు. ఒక్క ఎన్టీఆర్తో 101 సినిమాలలో నటించారు. ఇది అరుదైన రికార్డు. యమధర్మ రాజు అంటే మనం కైకాలలోనే చూశాం. రాజకీయాలలోకి రావాలంటే ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను". - చంద్రబాబునాయుడు, తెలుగుదేశం అధినేత