Chalo Assembly On March 20 : జీవో నెంబర్ 1 రద్దు చేయాలనే డిమాండ్ తో ఈ నెల 20 వ తేదీన అన్ని ప్రజా సంఘాలతో కలిసి 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమం చేపడతున్నామని జీవో నెంబర్ 1 రద్దు పోరాట ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. విజయవాడలో మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో ఎవరి అభిప్రాయాలు వారు చెబుతూ ప్రదర్శనలు, ర్యాలీలు, సభలు పెట్టుకోవచ్చునని, కానీ ఆ హక్కుకు తూట్లు పొడిచేలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఈ జీవో ద్వారా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తీసుకువచ్చారని ఆయన విమర్శించారు.
'ఛలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని విజయవంతం :ఎవరైనా సభలు పెడితే 14 రకాల నిబంధనలతో అవి జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారని, గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా చట్ట ప్రకారం అనుమతి ఇచ్చిందని విషయాన్ని గుర్తు చేశారు. నేడు పోలీసులే ఫిర్యాదు దారులుగా మారి హక్కులను కాల రాస్తున్నారని, పోలీసు వ్యవస్థను సొంత జాగీరుగా జగన్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఊరేగింపు పెడితే ట్రాఫిక్ కు అడ్డంకి అని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని, మరి జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, మాయలు ప్రజలకు చెప్పే బాధ్యత విపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. పోలీసులే రాస్తా రోకో చేసిన చరిత్ర ఒక్క ఏపీలోనే చూసి ఉంటామని అన్నారు. 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని జిల్లాల్లో సమావేశాలు చేపడతామన్నారు.