Telangana High Court : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్, ఇతర రికార్డులను కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు బ్రహ్మయ్య అండ్ కొ విజ్ఞప్తి చేసింది. తమ కార్యాలయంలో సోదాల నిమిత్తం ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు బ్రహ్మయ్య అండ్ కొ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. గత వారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసినప్పుడు పూర్తి సమాచారం అందుబాటులో లేదని తెలిపింది.
తమ భాగస్వామి కోటేశ్వరరావును గత నెల 28 మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 29వ తేదీ 5 గంటల వరకూ సీఐడీ అధికారులు తమ నియంత్రణలో ఉంచుకోవడంతో సమాచారం సేకరించలేకపోయామన్నారు. కార్యాలయంలో సోదాల నిమిత్తం 30 నుంచి 35 మంది వచ్చినా, ఇద్దరే యూనిఫాం వేసుకున్నారని మిగిలిన వారు మఫ్టీలో వచ్చారని బ్రహ్మయ్య అండ్ కో సంస్థ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. స్థానిక పోలీసులు ఎవరూ లేకుండా ప్రవేశించి బలవంతంగా ఇంటర్నెట్, సీసీటీవీ కనెక్షన్లను కట్ చేశారని తెలిపింది.
ఏపీ పోలీసులకు ఇక్కడ సోదా చేసే పరిధి లేదని అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కార్యాలయంలో ఉన్నవారందరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. మార్గదర్శి సమాచారాన్ని ఇస్తామని చెబుతున్నా పట్టించుకోకుండా కంప్యూటర్లలోని సమాచారాన్ని కాపీ చేసుకుని, రికార్డులను స్వాధీనం చేసుకున్నారని తెలియజేసింది.
సీఐడీ జారీ చేసిన సోదా ఉత్తర్వులు ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబధించినవే తప్ప మార్గదర్శి చట్టబద్ధ ఆడిటర్ పాత్రకు చెందినవి కావని తెలిపింది. కంపెనీ చట్టం కింద మార్గదర్శికి చెందిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను రూపొందించడమే మా బాధ్యతని చిట్ఫండ్ కింద ఎలాంటి ఆడిట్ నిర్వహించట్లేదని పిటిషన్లో పేర్కొంది.
సమాచారం తీసుకెళ్లిన వ్యక్తి అరెస్టు :మార్గదర్శి సమాచారాన్ని సమర్పించాలంటూ సీఐడీ అదనపు ఎస్పీ మార్చి 18న నోటీసు జారీ చేశారని, అయితే ఆర్థిక సంవత్సరాంతం కావడంతో మూడు వారాల గడువు కావాలని కోరినట్లు బ్రహ్మయ్య అండ్ కొ వారికి తెలిపింది. దీనికి వారు నిరాకరించడంతో 28న ఉదయం 10 గంటలకు శ్రావణ్ ల్యాప్టాప్తో విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లగా ఆయనతో పాటు వెళ్లిన రజత్ను నిర్బంధించి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని వివరించింది.