Be alert Cyber criminals have opened a new trend: ''హాలో అండీ.. మేం టెలికం కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ సిమ్ను 5జీ నెట్ వర్క్కు మారుస్తాం. దానికి మీరు చేయాల్సింది ఏమీ ఉండదు. మీ ఫోన్కు ఒక లింక్ను పంపిస్తాము. దానిపై మీరు క్లిక్ చేస్తే చాలు వెంటనే నెట్ వర్క్ 5జీకి మారుతుంది. కాబట్టి మీ ఫోన్కు వచ్చిన ఓటిపి నెంబర్ చెప్పండి అని అడుగుతారు. వాళ్ల మాటలు నమ్మి ఓటిపి చెపితే.. నిమిషాల్లో మీ ఖాతాల్లో దాచుకున్న నగదు మాయం చేస్తారు. కావున స్మార్ట్ ఫోన్లు వాడుతున్న ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండండి'' అని విజయవాడలో ఉన్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు అలా నిపుణులు చెప్తున్నారు? సైబర్ నేరగాళ్లు 5జీ పేరుతో ఫోన్లు కూడా చేస్తున్నారా? అనే తదితర సందేహాలపై నిపుణులు పలు కీలక విషయాలను వెల్లడించారు.
నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత రోజుల్లో మొబైల్ను వినియోగించని వ్యక్తి ఉండరంటే ఆశ్చర్యం లేదనే చెప్పాలి. అధిక సామర్థ్యం ఉన్న వీడియోలను డౌన్లోడ్ చేసుకోవటం, అప్లోడ్ చేసుకోవడం, వీడియో కాల్స్, తదితర అవసరాలు రానూరానూ ఎక్కువైపోతున్నాయి. దీంతో వినియోగదారుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని నగదు కాజేసేవాళ్లు కూడా పెరిగిపోతున్నారు. మీ చరవాణిలో 5జీ సేవలను పొందాలంటే మీకు వచ్చిన సందేశంలోని లింకును క్లిక్ చేస్తే చాలు అంటూ సైబర్ నేరగాళ్లు తమ పనిని మొదలుపెడతారు. ఆ తర్వాత మీ ఫోన్కు ఒక లింక్ వచ్చింది దానిని క్లిక్ చేయగానే నేరుగా 5జీలోకి మారిపోతుంది అంటూ బోల్తా కొడతారు.
అలా నమ్మి లింక్ని క్లిక్ చేస్తే.. వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంకుకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్లు కూడా వారి చేతికి వెళ్లిపోతాయి. ఆ తర్వాత టెలికాం సంస్థ నుంచి కాల్ చేస్తున్నట్లు మనల్ని నమ్మిస్తారు. మీరు మా అమూల్యమైన వినియోగదారులు కావటంతో మిమ్మల్ని మాత్రమే ఎంపిక చేశామంటూ చెబుతూ.. 5జీకి మారాలంటే సిమ్ను మార్చాల్సి ఉంటుందని, మీకు అదంతా అవసరం లేదని మీకు పంపించే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా నామమాత్రం రుసుము చెల్లిస్తే పని అయిపోతుందంటూ మభ్యపెడతారు. స్కాన్ చేయటమే ఆలస్యం మన యూపీఐ ఐడీ సమాచారాన్ని సేకరించి మన బ్యాంకులో ఉన్న సొమ్మును కాజేస్తారు అని వివరించారు.