ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విన్నావా జగన్‌ మామయ్య ఈ బడుగు బిడ్డ ఆవేదన.!

BC Students Suffer as govt Fails on hostel management: కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో బీసీ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సరైన మౌళిక సదుపాయాలు లేక, ఉన్నవాటిని వినియోగించే పరిస్థితులు లేక బడుగు బలహిన వర్గాల పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లను పరిశీలిస్తే అవి వసతి గృహాలో? గోదాములో అర్థంకాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 10:24 AM IST

BC Students Suffer as govt Fails on hostel management
BC Students Suffer as govt Fails on hostel management

BC Students Suffer as govt Fails on hostel management: బీసీలంటే బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ కాదు, బ్యాక్‌ బోన్‌.! బడుగుల ఓట్ల కోసం సభలల్లో ఇలా డైలాగ్‌లు కొట్టే జగన్‌, బీసీ బిడ్డల్ని గాలికొదిలేశారు.! తలుపుల్లేని గదులు, అక్కరకురాని మరుగుదొడ్లు, దుప్పట్లు లేక వణుకుతున్న పిల్లలు.! ఇలా వసతిగృహాలు ఒక్కటైనా చక్కగా ఉంటే ఒట్టు.! రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లను పరిశీలిస్తే అవి వసతి గృహాలో? గోదాములో అర్థంకాని పరిస్థితి. మేనమామనంటూ మాటల్లో మమకారం తప్ప చేతల్లో ఉపకారం చేయడం లేదని, పిల్లలు వాపోతున్నారు.

అనకాపల్లి జిల్లా, కశింకోట: అనకాపల్లి జిల్లా కశింకోట బీసీ సంక్షేమ వసతి గృహంలో 87 మంది పిల్లలు ఉంటే ఐదు స్నానపుగదులు, మరుగుదొడ్లున్నాయి. ఒక్కదానికీ తలుపుల్లేవ్‌. ఇక కిటీకీలైతే టూరింగ్ టాకీస్‌ కంతల్లా కనిపిస్తున్నాయి. పిల్లలు నిద్రపోయే గది కిటికీకి తలుపులు కాదుకదా కనీసం ఐరన్ మెష్‌ కూడా లేదు. పిల్లలే పాతదుప్పటి కట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మంచాలు లేకపోవడంతో నేల మీదనే నిద్రిస్తూ చలికి వణుకున్నారు.
విజయనగరం బీసీ కళాశాల వసతిగృహం: ఇక విజయనగరం బీసీ కళాశాల విద్యార్ధుల వసతి గృహ భవనం చూస్తే! జగన్‌ బొమ్మతో పెట్టిన ఈ బ్యానర్‌ తప్ప ఇక్కడంతా శిథిలావస్థకు చేరింది. ఈ స్విచ్‌ బోర్డు ఎప్పట్నుంచో ఇలా ప్రమాదకరంగా మారినా, మార్చాలనే ఆలోచనే లేదు! పాత ప్లెక్సీలు, పాత దుప్పట్లే ఇక్కడి కిటికీలకు తలుపులు. మంచినీళ్లైతే, పిల్లలే టిన్‌లు పట్టుకుని తెచ్చుకోవాల్సిందే. విజయనగరంజిల్లాలో 53 బీసీ వసతి కేంద్రాలుంటే 15వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మరో 15కేంద్రాలు నాడు-నేడుకు ఎంపికైనా ఇంతవరకూ మరమ్మతు పనులే ప్రారంభించలేదు. పార్వతీపురం బాలుర బీసీ హాస్టల్‌ గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. మరుగుదొడ్లైతే, పాడుబడ్డ అవశేషాల్లా మిగిలాయి. పిల్లలు కాలకృత్యాల కోసం ఇలా పొలాల్లోకి వెళ్లాల్సిందే. స్నానాలు ఆరుబయట చేయాల్సిందే ! ఎంత చలైనా కటిక నేలపై పడుకోవాల్సిందే.

112 మంది విద్యార్థినిలు- 3 మరుగుదొడ్లు! సమస్యల వలయంలో ఉరవకొండ బాలికల వసతి గృహం

ఒంగోలు బీసీ కళాశాల వసతిగృహం:ఒంగోలులోని బీసీ కళాశాల వసతిగృహం ఎదుట డేంజర్‌ బోర్డుపెట్టడం మేలు. పిల్లలు బ్యాగులు పెట్టుకునే ఐరన్‌ ర్యాక్‌ ఇలా ఒరిగి ఎప్పుడు ఏ బడుగుబిడ్డ మీద పడుతుందో తెలియని పరిస్థితి. ఫ్యాన్‌ రాడ్‌ సీలింగ్‌కు వేలాడుతుంటే, ఫ్యాన్‌ ఇలా ఊడి మూలన పడింది. కరెంటు బోర్డైతే ఇలా ప్రమాదకరంగా తయారైంది. ఇక హైస్కూల్ పిల్లలుండే బీసీ బాలుర వసతి గృహంలో ఊడిన కరెంటు బోర్డు తాకొద్దని చేయొద్దని ఓ కాగితం అంటించి ఊరుకున్నారు. ఇక్కడ 90 మంది పిల్లలకు తొమ్మిదే మరుగుదొడ్లున్నాయి. గదికి ఒకే తలుపుంది. ఎండైనా, చలైనా అదే రక్షణ. గదులకు కిటికీలు పగిలిపోయాయి. జాలీలూ లేకపోవడంతో వర్షం పడితే జల్లు కొడుతోంది. దోమ తెరల‌్లేవు..! ఎప్పుడో ఇచ్చిన దుప్పట్లు చిరిగాయి. పడుకోడానికి ఇబ్బందిపడలేక...పిల్లలే ఇళ్ల నుంచి చాపలు తెచ్చుకున్నారు.

సత్యసాయి జిల్లా, కొత్త చెరువు :సత్యసాయి జిల్లా కొత్త చెరువు బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులది మరో కష్టం. బయటకు వెళ్లలేరు, లోపల ఉండలేరు. ఈ హాస్టల్‌ చుట్టూ, మురుగు కాలువ ప్రవహిస్తోంది. ఇకచెప్పేదేముంది బయటకెళ్తే కంపు, లోపలికెళ్తే దోమల గుంపు. రోగాలబారినపడుతున్నామని పిల్లలు వాపోతున్నారు. లేపాక్షి బీసీ బాలుర వసతి గృహానికి సొంత భవనంలేదు. గతంలో ఉన్న భవనాన్ని ఐటీఐ కోసం తీసుకోగా, ప్రభుత్వం మరో భవనాన్ని కేటాయించలేదు. పాఠశాలలోని రెండు గదులను వసతి గృహంగా వినియోగిస్తున్నారు. వసతి సరిగాలేక నాలుగేళ్లుగా నరకం చూస్తున్నామని పిల్లలు వాపోతున్నారు.

జగన్ పరిపాలనలో ప్రభుత్వ వసతి గృహాల్లో 'సంక్షేమం నిల్ - సంక్షోభం పుల్'

కల్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని జూనియర్ కళాశాల బీసీ వసతి గృహ దుస్థితి.! చూడడానికి మరుగుదొడ్లు వరుసగా ఉన్నా అవి పనిచేయక, పిల్లలు బహిర్భూమికెళ్తున్నారు. అద్దె భవనంలో నడుస్తున్న ఈ బీసీ వసతి గృహంలో 150 మంది పిల్లలున్నా సౌకర్యాలు అస్సలు బాగోలేవు. ఒక ఫ్యాన్‌ రెక్క విరిగి ఇలా అవిటిదైపోయింది. అనంతపురం జిల్లాలోని ఏ బీసీ హాస్టల్‌కు వెళ్లినా అక్కడ సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి.

ఇవి రాష్ట్రంలోని బీసీ వసతి గృహాల దుస్థితికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 3వేల300 కోట్ల రూపాయలతో ‘నాడు-నేడు’ పనులు చేపడుతున్నామని ఏడాది క్రితం గంభీరమైన ప్రకటనలు చేయడమే తప్ప, జగన్‌ ప్రభుత్వంలో పని చేసింది లేదు. పిల్లలు కనిపిస్తే మేనమామనంటూ ఊరడించే జగన్‌ వాళ్ల కష్టాలకు వాళ్లనే వదిలేస్తారా? నాలుగున్నరేళ్లలో మాటల్లో మమకారం కట్టిపెట్టి చేతల్లో ఉపకారం చేసుంటే పిల్లలు ఇలా కష్టాలు పడేవారా? బడుగు బిడ్డల తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి.

కింద పడుకోవాల్సి వస్తే మన పిల్లల్ని హాస్టల్స్​లో చేరుస్తామా- ప్రభుత్వంపై హాకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details